Sunday 24 February 2013

గురువు - శిష్యుడు



గురువులు వేరు ఉండవచ్చు కానీ గురు తత్వం ఒక్కటే.
అమ్మలు వేరు ఉండ వచ్చు, కానీ అమ్మ తనం ఒక్కటే.
గురువే అమ్మ, అమ్మే గురువు. వారిద్దరికీ భేదము లేదు. గురువులు అందరూ ఒక్కటే. మార్గదర్శకులే.
ఇది తెలుసుకో లేనివాడు మూర్ఖుడు.

 
గురు శిష్యుల అనుబంధము ఎంతో పవిత్రమైనది, తండ్రి కొడుకుల కంటే ఎంతో గొప్పది మహోన్నతమైనది అని ఎంతో మంది చెప్పారు, ఆచరించి చూపారు. దానికి పురాణములలో ఎందరో ఋషులు మనకు తార్కాణముగా కనిపిస్తారు.
 
గురువు తన శిష్యులను కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, చూస్తారు. 
ఒక సారి నేను హరిద్వార్ దగ్గర పని చేసేటప్పుడు చాలా తీవ్రమైన జ్వరం వచ్చినది, వారం, పది రోజులైనా తగ్గలేదు, అప్పడు మా గురువు గారు (80) మహా విద్య పారాయణం చేసి, ఆ తీర్ధమును తీసుకొని వేరే శిష్యుణ్ణి వెంట పెట్టుకొని రైలు లో అన్నం నీళ్ళు లేకుండా రెండు రోజులు ప్రయాణించి నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని ఆ తీర్ధము నాకిచ్చి మా ఇంట్లో వారం  రోజులు వుండి , రోజూ  మహా విద్య పారాయణం చేసి తీర్ధము ఇచ్చారు. 
నా పేరు రామచంద్ర, అందుకని "రామచంద్రా, రామచంద్రా" అని అంటూ ఎంతగానో బాధ పడ్డారు. వారు ఇంట్లో తప్పించి మరే ఎక్కడా ఏమీ తినరు, పచ్చి మంచి నీళ్ళు ముట్టరు. ఏది చేసినా మడి తోనే, మడి లేకుండా ఏమీ చెయరు.  రైల్లో కూడా ఇంటి నుంచి పట్టుకొచ్చిన మంచి నీళ్ళే, ఆ రెండు రోజులు అటుకులు తింటూ మంచి నీళ్ళు త్రాగుతూ తెనాలి నుంచి నాకోసం హరిద్వార్ కు వచ్చినారు. ఇప్పటికీ అదే ప్రేమ వారిది.  
 
గురువును చూడ దానికి శిష్యుడు వెళ్ళాలి, కానీ మా గురు దేవుళ్ళు నేను వెళ్ల లేక పోతే వారె నా దగ్గరకు ఒక తండ్రి లాగా వస్తారు. ఒక్క పైసా నా నుంచి తీసుకోరు. మా తండ్రి గారి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు, నాకోసం ఆందోళన చెందుతారు. ఏమి ఇచ్చి నేను ఋణం తీర్చుకోగలను, అటువంటి వారు నాకు ఎన్ని జన్మలు తపస్సు చేస్తే లభిస్తారు. వారి దగ్గర ప్రేమ తప్పించి కోపము ఉండదు. కోపం ఎరుగని మహా మనిషి. అమ్మను పూజించే వాళ్ళు, ఉపాసించే వాళ్ళు కొన్నాళ్ళకు అమ్మలాగ అయిపోతారు, అమ్మ తనం వారికి వచ్చేస్తుంది. అమ్మ లాగ వారి హృదయం మారి పోతుంది, మగ వాళ్ళు అయినా సరే, తండ్రి హృదయం పోయి అమ్మ హృదయం వస్తుంది వాళ్ళకు. 
ఒక తల్లి దగ్గరకు పోతే ఎంతటి అనుభూతి లభిస్తుందో అంతటి ఆప్యాత లభిస్తుంది వారి దగ్గర.. 
మా పిల్లలకు ఏదన్నా బాగాలేక పోతే నాకు వీలు కాక చేయక పోతే వారు మా ఇంటికి వచ్చి, మా పిల్లల కోసం వారు రోజుకి మూడు సార్లు మహా విద్య పారాయణ చేసి ఆ తీర్ధం ఇచ్చి, మా పిల్లల జబ్బు నయం చెస్తారు. నేను చేయలేనిది మా గురువులు వచ్చి మా కోసం వారు ఉపవాసం వుండి, పూజ చేస్తారు,
వారి అభిమానము, అవ్యాజమైన ప్రేమను చూచి తట్టుకోలేక, వారిని ఈ వయస్సులో ఇబ్బంది పెట్ట కూడదని, ఇప్పుడు మేము వారికి  అబద్దాలు చెబుతున్నాము ఏది జరిగినా. ఏవీ చెప్పడం లెదు. 
 
అదీ గురువు ల యొక్క ప్రేమ వారి గురించి చెప్పాలంటే కొన్ని వేల పేజీలు  వ్రాయ వలసి వస్తుంది.  అదీ గురు ప్రేమ. గురువులు శాంతి, ప్రేమ స్వరూపులు
 
గురువులకు ఎప్పుడూ అందరి మీదా ఒకే ప్రేమ వుంటుంది, అందరి శిష్యుల మీద ఒకే ఆప్యాత వుంటుంది. అందరి కోసం వారు కోటకలాడుతారు. ఒకరి మీద ఎక్కువ, ఒకరి మీద తక్కువ వుండదు. అది మీ అపోహ మాత్రమె. గురువులు తమ కన్న బిడ్డల కన్నా శిష్యులను ఎక్కువగా ప్రేమిస్తారు..  ఒక్కోసారి తమ కొడుకులకు కూడా చెప్పని మూల మంత్రములను శిష్యులకు ఇస్తారు. దానికి మా గురువులే సాక్ష్యం. వీడు ఇందుకు తగడు అని అనుకొంటే వాడు తన స్వంత బిడ్డైనా సరే ఈ శ్రీవిద్య చెప్పడు, అర్హుడైన తన శిష్యునికే చెబుతాడు . 
 
తన శిష్యుల కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూస్తాడు, తన కొడుకు చావు బ్రతుకుల మధ్య వున్నా, శిష్యుని కోసం పరిగేత్తుకొని  వస్తాడు. అదీ గురువు అంటే. అటువంటి గురువులను మనము అవమానించ కూడదు, వారిని కష్ట పెట్ట కూడదు, వారి బరువును శిష్యులుగా మనము మోయాలి, అప్పుడే మనము నిజమైన శిష్యులము అని      అని పించుకొంటాము. గురువు కోసం మనము తనక లాడాలి. త్యాగం చేయాలి. 
 
గురువులు దొరక లేదు, గురువులు చెప్పలేదు అని మనము అనకూడదు, ఎంత వెదికినా గురువులు దొరక లేదు అని అనకూడదు.  ఏదో లోపం నీలోనే వున్నది, నీకు ఇంకా సమయం రాలేదు, ప్రారబ్ద ఖర్మ వదల లేదు, అందుకే గురువుల అనుగ్రహము నీ పైన కలుగ లేదు.  నీవు ఎదురుగా నులుచొని వున్నా వారు నీకు ఉపదేశము చేయరు, ఎక్కడో దూరముగా ఉన్నవారిని  వెతుక్కొన్ని వెళ్లి మంత్ర దీక్ష ఇస్తారు..  నా విషయములో అలాగే జరిగినది. 

గురువులు మంత్ర దీక్ష నీకు ఇచ్చారు అంటే దానితో పాటు వారు తపస్సు చేసి సంపాదించుకున్న తపః శక్తి, పుణ్యము నీవు అడగ కుండానే నీకు ధారపోస్తారు, నీ జన్మ జన్మల పాపం వారు స్వీకరిస్తారు. ఇది నీవు అడిగినావా లేదా అని చూడరు. మంత్ర దీక్ష అంటే అది. ఎదో మంత్రము ఇచ్చారు అని నీవు అనుకోకూడదు, నీ పాపము వారు స్వీకరిస్తారు. నీ బదులు వారు నీ పాపము అనుభవిస్తారు. అది గురువుల యొక్క ఉదారత. ప్రేమ. అది తెలుసుకొని నీవు మసులుకోవాలి. ఇలా తపః శక్తి అంతా వారి శిష్యులకు ధార పోస్తే ఇక వారికి మిగిలేది ఏమిటి? అదే త్యాగం.
 
శ్రీవిద్య మామూలు విద్య కాదు, దీనికోసం గురువులను మోహపరచకూడదు, బలవంత పరచకూడదు, వారికి మనపై అనుగ్రహము కలగాలి, అది ఒక రోజు కావచ్చు, ఒక సంవత్సరం కావచ్చు, ఒక జన్మ కావచ్చు. ఎదురు చూడాలి తపనతో. తపన,శ్రద్ధ, పట్టుదల లేకుండా శ్రీ విద్య రాదు. అనుకోగానే వచ్చేయడానికి ఇది మామూలు విద్య కాదు. గురువులకు మనపై ఎంతో నమ్మకం కలగాలి, దానికి వారు ఎన్నో పరీక్షలు పెడతారు, ఒక్కోసారి అమ్మే పరీక్షలు పెడుతుంది. నీవు ఈ విద్యకు సిద్దముగా వున్నావా లేదా అని గురువులు చూస్తారు, పూర్వ జన్మ పుణ్య ఫలము వుంటే కానీ ఈ విద్య రాదు. కొంత మందికి అడుగగానే ఈ విద్య ఇస్తారు, కొంత మందికి పది సంవత్సరములైనా ఇవ్వరు, ఇవ్వనంత మాత్రాన వారికీ మీ పైన శ్రద్ద లేదు అని కాదు, నీకు వారి పైన శ్రద్ద లేదు అని అర్ధము. నీవు ఇంకా సంసిద్దుడవు కాలేదు అని అర్ధం . లోపం నీలో వుంచుకొని గురువులను నినదించ కూడదు. 
 
గురువులు ఒక మాట చెప్పినారు అంటే అది వేద వాక్యం అని నమ్మాలి, దానిని ప్రశ్నించ కూడదు, వెంటనే ఆచరించాలి. గురువులు నీకు విద్య ఇవ్వలేదు అని అంటే దాని వెనుక ఏదో పెద్ద కారణం వుండి వుంటుంది,నీ లోపమేమిటో నీవు తెలుసుకో.    "అయ్యో గురువు గారికి నా మీద ఎందుకు అనుగ్రహము కలుగ లేదు"... అని ఏడవాలి, అంతేగాని గురువులను తప్పు పట్ట కూడదు, గురువుల మనస్సును నీవు దోచుకోవాలి, అలా నీ నడవడిక వుండాలి. గురువులకు, అమ్మకు ఎప్పుడు అనుగ్రహము కలుగుతుందో అప్పుడే నీకు ఈ శ్రీవిద్య వస్తుంది.  నీవు పరిగెత్తగానే ఈ విద్య రాదు. కొన్ని వేల సంవత్సరములు కాళ్ళు పట్టుకొంటే గానీ అగస్త్యులకు, శ్రీ హయగ్రీవులు ఈ శ్రీవిద్యను చెప్ప లేదు, ఇక మనమెంత చెప్పండి. ఎన్నో పరీక్షలు వస్తాయి. ఎవరు నిజముగా మనఃస్పూర్తిగా, భక్తితో తమ గురువుల యొక్క పాదములను తమ శిరస్సు మీద వుంచుకొంటారో వారికి ఈ శ్రీవిద్య త్వరగా వచ్చును. గురువుల చెంత కొద్దిగా కూడా అహంకారము ఉండకూడదు. నీ డబ్బు, హోదా, ఆస్తి వారి ముందు తృణప్రాయము అది తెలుసుకొని మనము మసులు కోవాలి. గురువుల మీద పూర్తిగా నమ్మకము వుంటే నీ కోరికలన్నీ తీరుతాయి, లేదంటే లేదు. గురువులను అనుమానించకూడదు, వారి తపః శక్తిని శంకించకూడదు. ఏదన్నా జరగక పోతే నీకు సరైన సమయము రాలేదని అనుకో. గురువులను దూషిస్తే అది అమ్మను దూషించినట్లే.
 
శ్రీవిద్యా సాంప్రదాయములో ఎన్నో మార్గములు, ఎన్నో పద్దతులు వున్నాయి, ఒక్కోరు ఒక్కో సాంప్రదాయములో చెబుతారు, మార్గములు అనేకము వున్నా చివరకు చేరేది ఒకే చొటికి. అందరి goal ఒకటే. 
ఒక గురువు ఎక్కువ ఇంకో గురువు తక్కువ అని అనుకోకూడదు, అలా అనుకోన్నవాడు ఈ శ్రీ విద్యకు అనర్హుడు, వాడికి ఈ విద్య రాదు, వాడి చెంత అమ్మ ఉండదు. శ్రీవిద్యలో గురువు లను మార్చకూడదు.  చివర దాకా ఒకే గురువు దగ్గర వుండాలి, చెప్పినా చెప్పక పోయినా వారినే అంటి పెట్టుకొని వుండాలి, వారి అనుగ్రహము కలిగే దాక. స్త్రీ తన భర్తను ఎలా మార్చదో, అలా శిష్యుడు తన గురువులను మార్చ కూడదు, ఒక వేళ అలా చేస్తే దానిని వ్యభిచారము అని అంటారు. ఎవరికి ఎవరు గురువులో అమ్మ నిర్ణయిస్తుంది, వాడి పూర్వ జన్మ కర్మానుసారము, క్రితము జన్మలో ఏ సాంప్రదాయములో కొనసాగినాడో అదే సాంప్రదాయములో ఈ జన్మ లో కూడా గురువు ధొరుకుతారు. ఇది జన్మ జన్మల బంధం. గురువుల మీద నమ్మకము, భక్తీ లేకపోతే ఈ విద్య రాదు.
కర్మ పూర్తి కాగానే గురు దేవుళ్ళు మీకు కనబడుతారు, మీకు శ్రీ విద్య ఇస్తారు, అప్పటి దాకా మీ సాధన కోన సాగాలి, మీ అన్వేషణ కోన సాగాలి. 

సాధారణముగా శ్రీవిద్య పూర్తిగా నేర్చుకోవడానికి, పూర్ణ దీక్షుతుడు (పట్టాభిషిక్తుడు) కావడానికి ఒక పుష్కర కాలం (12 సం.) పడుతుంది, అయితే శిష్యుల యొక్క స్థాయి బేధమును బట్టి కొంతమంది పది, ఐదు, రెండు, ఒకటి సంవత్సరములలో, ఈ విద్యను  నేర్చుకొంటారు.

ఇది పూర్తిగా మంత్ర శాస్త్రము. గట్టి పట్టుదల, గురువుల మీద నమ్మకము వుండాలి, నమ్మకము లేక పోతే ఈ విద్య రాదు. ఫలించదు. స్త్రీలు, పురుషులు, అన్ని వర్ణముల వారు ఈ విద్యకు అర్హులే.

అమ్మ ఒడిలోకి చేరడానికి అందరూ అర్హులే ఒక్క ప్రేమ వుంటే చాలు.

కావలసిన అర్హత అమ్మ మీద, గురువుల మీద ఎనలేని నమ్మకం, భక్తీ వుండాలి. దూకమంటే దూకేటట్టు వుండాలి.

గురువులు తలుచుకొంటే ఒక్క రోజులో 12 ఏండ్ల పూర్తి సాధన, విద్యనూ ఒక్క రోజులో నేర్పించగలరు.
అవసరమైతే శిష్యుని యొక్కజుట్టు పట్టుకొని పైకి లాగ గలరు.

ఈరోజు నేర్చుకొని, రేపు వదిలేసి, ఎల్లుండి తన గురువులనే తిట్టేటట్టు ఉండకూడదు, జన్మ జన్మలకు ఆ పాపం కట్టి కుదిపేస్తుంది. వదలదు.
 
గురువులు అందరూ ఒక్కటే. గురువులు వేరు ఉండవచ్చు కానీ గురు తత్వం ఒక్కటే. 
అమ్మలు వేరు ఉండ వచ్చు, కానీ అమ్మ తనం ఒక్కటే. 
గురువే అమ్మ, అమ్మే గురువు. వారిద్దరికీ భేదము లేదు. గురువులు కరుణాసముద్రులు.
 
గురువు లందరినీ ఒక్కటిగా చూచి గౌరవించు కోవడం నేర్చుకోవాలి, ఒకరిని గౌరవించి, ఇంకోరిని తిట్ట కూడదు, పాపం చుట్టు కొంటుంది, అది మీ గురువులకే తగులుతుంది.  గురుమండలం ఒక్కటే, గురుమండల స్వరూపిణి ఒక్కటే. గురువు లందరూ ఒక్కటే, అందరిలో మీ గురువులను, మీ గురువులో అందర్నీ చూడటం నేర్చుకోండి.
ఎవరు ఇలా ఉంటారో వారికి అమ్మ దర్శనం సులభముగా దొరుకొతుంది.

గురుమండల స్వరూపిణి అయిన  ఆ తల్లికి నమస్కరిస్తూ,
సమస్త గురు దేవుళ్ళకు నమస్కరిస్తూ, ఆది గురువులకు, మూల గురువులకు నమస్కరిస్తూ,

 
న గురోరధికం,   న గురోరధికం,   న గురోరధికంన గురోరధికం
శివ శాసనతః   శివ శాసనతః   శివ శాసనతః    శివ శాసనతః

మీ

శ్రీ భాస్కరానంద నాథ
24-02-2013
 
 

Wednesday 20 February 2013

మంత్రోపాసన – నాదోపాసన


మంత్రోపాసన నాదోపాసన

శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాదం ఎక్కడి నుంచి ఉత్పన్నమౌతుంది? మంత్రానికి మూలం ఏమిటి? మంత్రానికి మూలం బీజం, ఆ బీజానికి మూలం నాదం, ఆ నాదానికి మూలం బిందువు. అన్నింటికీ మూలం బిందువు.
బిందువు లో నుంచే సృష్టి అంతా జరిగినది. బిందువు వికసనం వలన ఇది అంతా జరిగినది అని మనకు తెలుసు. బిందువు ఎందుకు వికసనం జరిగినది? దాని లోపలి శక్తి తాడనము చేత.కాబట్టి బిందువు లోపలే శక్తి వున్నది. దీనిని బట్టి మనకు అర్ధమయ్యేది ఏమిటంటే బిందువు పరమాత్మ, దానిలోపలి శక్తి ప్రకృతి.
అయ్య, అమ్మ ఇద్దరూ ఒక్కటే. ఒకరి లోపల ఒకరు వున్నారు. శక్తి లేనిదే అయ్య కదలడానికి అశక్తుడు అని మనకు తెలుసు. ఇదే మాటను శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పి వున్నారు.
ఇప్పడు మనము తెలుసు కోవలసినది అసలు ఈ శక్తి ఎవరు? ఏమిటి?ఎక్కడి నుంచి వస్తుంది? అని.
ఝుమ్మంది నాదం .. అని మనకు తెలుసు. నాదం లో నుంచి ఝు౦ అనే శబ్దం వస్తుంది. ఏమిటి ఈ ఝు౦ అనే నాదం అని పరిశీలిస్తే ఇదే శక్తి. బిందువు లో నుంచి ఝు౦ అనే నాదం వస్తుంది, అదే శక్తి. అదే అమ్మ. అదే భ్రమరాంభిక. అదే ఆది శక్తి. శబ్దం లో నుంచి నిశ్శబ్దం, దానిలో నుంచి శబ్దం. నిశ్శబ్దం లో నుంచి శబ్దం ఎలా? అదే ఝు౦ అనే నాదం.
ఈం, ఈమ్ , అమ్ , మ్. వీటిల్ని పరిశీలించండి. మ్” ... అనేది శక్తి. అదే ఉమా. అదే మూల ప్రకృతి.
నాదంలో నుంచి వచ్చేది అదే... “మ్”.

హార్మోనియం పెట్టెలో నుంచి వచ్చేది అదే ధ్వని. వీణ మీటితే అదే ధ్వని, నాద స్వరములో అదే ధ్వని,

గంట లో నుంచి వచ్చేది అదే ... “మ్”.

ఇతర గ్రహాలలో విన వచ్చేది అదే. నిశ్శబ్దం లో నుంచి వచ్చేది అదే. చంద్ర మండలములో“మ్”. అనే ధ్వని వినిపిస్తుందని చెప్పారు శాస్త్రజ్ఞులు. విద్యుచ్చక్తి లో అదే ధ్వని. శక్తి ఎక్కడ వుందో అక్కడ అదే ధ్వని.

High Induction transformer / HT voltage లో అదే ధ్వని. ...... “మ్”. 

ల౦, హం, య౦, రం, వం, సం, గం... లో నుంచి వచ్చేది అదే శబ్దం ...... “మ్”.

శ్రీరాముని తారక మంత్రమైన బీజాక్షరం రాం, రామ్లో నుంచి అదే శబ్దం ...... “మ్”.

రామం, విష్ణుం,శివం, కేశవం, దామోదరం ..... లో నుంచి అదే శబ్దం...... “మ్”.

విష్ణు సహస్ర నామం లోని విష్ణుంఅదే.

 హ్రీం కారము లోని   కారము అదే. ... మ్”.  అదే శ్రీమాత. 

హిరణ్య వర్ణాం హరిణీం,........... హిరణ్మయీం... అదే శబ్దం...... “మ్”.  

ఏ మంత్ర మైనా అదే "ఈమ్" అనే శబ్దం రావాలి. అదే ప్రాణ శక్తి, అదే జీవ శక్తి. అదే చలనము. మంత్రానికి మూల శక్తి అదే.

అదే ఆదిశక్తి. "ఈం"అనేది మూల ప్రకృతి, అదే నాదం.

ఓం కారములోని జీవ శక్తి అదే. "మ్.

దానిని మీద ధ్యాస వుంచండి, సమాధి లోకి వెళ్లి పోతారు. మనము చేయవలసిన సాధన అదే. అందరం కలిసి చేద్దాము.

ఝు౦ కారం వినడమే. శ్రీశైలం లో వినబడేది అదే. కైవల్యం అదే. అదే కైవల్యం. అదే కైవల్యం. నిశ్శబ్దం లోకి వెళ్ళగలిగిన వాడు ఈ శబ్దం వినగలడు , అది వినగలిగిన వాడు ధన్యుడు.

అదే సమాధి స్థితి. దానిలో లీనం అయిపోవడమే.
--



మీ

శ్రీ భాస్కరానంద నాథ



 

Tuesday 12 February 2013

శ్రీ లలితా పంచమి

అయ్యా,
15-02-2013 తేది శుక్రవారం శ్రీ లలితా పంచమి
ఎల్లుండి 15-02-2013 తేది శుక్రవారం శ్రీ లలితా పంచమి. జగన్మాత ఆవిర్భవించిన రోజు. మహత్తరమైన రోజు. రాక్షసులను సంహరించడానికి తానూ అగ్నిగుండం లో నుంచి అవతరించినది.
ఆ తల్లి బాలా త్రిపుర సుందరిగా కొలువై వుండే రోజు. అందరూ చక్కగా శ్రీ లలితా సహస్రనామములు చదువుకొని, ఆ తల్లికి పంచ పూజలు చేసి, ధూప, దీప, నైవేద్యములను సమర్పించ వలసినదిగా మనవి.
ఈ రోజు అమ్మ బాల రూపములో వుంటుంది, బాలలను పూజించండి.

అయ్యా ఈ మాఘ శుద్ధ పంచమీ (15-2-2013), వసంత పంచమీ అని, మదన పంచమీ అని, లలితా పంచమీ అని వాడుకలో పిలుస్తూ వుంటారు.
త్రిశక్తి స్వరూప మైన ఆ లలిత త్రిపుర సుందరి, వాగ్భవ రూపిణి అయిన ఆ తల్లి సరస్వతీ రూపములో రేపు కొలువై వుంటుంది.
బాసరలో రేపు చాలా కోలాహలముగా వుంటుంది. చదువుల తల్లి యైన ఆ అమ్మ వారు దేదీప్యమానముగా వెలిగి పోతూ వుంటుంది రేపు. కొన్ని వేల మంది పసి పిల్లలు తమ అక్షరాభ్యాసమును రేపు ఆమె సమక్షములో దిద్దుకో బోతున్నారు.
ఎవరైనా పసి పిల్లలు వుంటే రేపు దివ్యమైన ముహూర్తం అమ్మ సన్నిధిలో, ఎ దేవాలయములోనైనా సరే మీ పిల్లలకు అక్షరాభ్యాసము చేయించండి.
ఆ సరస్వతీ కటాక్షము మెండుగా వుంటాయి.
రేపు మానవులే కాకుండా యక్ష, రాక్షస, గంధర్వాది దేవతా బృందములు, మునులు, యోగులు ఆ తల్లిని పూజించి ఉపాసించుతారు.
ప్రాతః కాలమునందే లేచి స్నానం, సంధ్య, ధ్యానం మొదలైన నిత్య నైమిత్తిక కర్మలు ముగించుకొని స్వశాఖ పద్ధతి అనుసరించిగానీ, స్వ కుల సాంప్రదాయానుసారముగా గానీ కలశ స్థాపన చేసి, దాని ముందు పుస్తకం వుంచి రెంటి యందునూ బంగారు నాణెములు వుంచి, ఆపైన షోడశోప చారములతో సరస్వతీ మాతను పూజించవలెను.
పూజానంతరము పాలు, పెరుగు,వివిధ పిండి వంటకములు, పంచదార, తెల్ల బెల్లం, పాయసం, నేతితో వండిన గోధుమ పిండి అప్పాలు, అరటి పళ్ళు, వెన్న ... అమ్మకు నివేదన చేయాలి.
తెల్లని వస్త్రం, చందనం, తెల్ల పూవ్వుల దండ... మొదలగునవి సమర్పించాలి.
వీణా పుస్తక పాణీ, సరోజ దళ నయనా అని అంటూ కీర్తించాలి.
xxxxx సరస్వత్యై స్వాహా అనే అష్టాక్షరీ మహా మంత్రమును శ్రద్ధతో జపించాలి.
మునుపు వాల్మీకి గంగ ఒడ్డున ఈ మహా మంత్రమును భక్తీ శ్రద్ధలతో జపించి సరస్వతీ కృపకు పాత్రుడు అయి మహా కవి అయినాడు. భ్రుగువు వల్ల శుక్రుడు, బ్రహ్మ నుండి భ్రుగువు ఈ మంత్రమును పొంది ఆ తల్లి యొక్క కటాక్షమును పొందినారు. ఈ మహా మంత్రమును నాలుగు లక్షల మార్లు జపించిన వాడు సరస్వతి అనుగ్రహానికి పాత్రుడై మహా కవి, సర్వ శాస్త్ర కళా విశారదుడై సమస్త విద్వజ్జన వందితుడు అవుతాడు.
అటువంటి చదువుల తల్లికి నమస్కరిస్తూ,
నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసినీ,
త్వామహం ప్రార్ధయే నిత్యం విద్యా దానం చ దేహిమే.
 
25-02-2013 - మాఘ పౌర్ణమి
ఈ రోజు అమ్మ తన పరిపూర్ణ స్వరూపమతో, చతుషష్టి కళలతో లలితా త్రిపుర సుందరిగా, శ్రీ రాజ రాజేశ్వరిగా, శ్రీమత్సింహాసనేశ్వరీ గా పున్నమి వెలుగులో, చంద్ర బింబములో కొలువై భక్తుల కోరికలను ఈడేర్చేందుకు
సంసిద్దురాలై వుంటుంది. ఈ రోజు అమ్మ పెద్ద ముత్తైదు రూపములో వుంటుంది, కావున ఈ రోజు ఇంటికి వచ్చిన మొదటి ముత్తైదువును పూజించండి. ఎవరు కనిపించినా వెంటనే పసుపు, కుంకుమలను, వస్త్రములను సమర్పించండి. పౌర్ణమి నాడు అమ్మ విశేష కృపతో, ప్రేమతో నిండి వుంటుంది, అడిగిన వారికీ అడిగినట్లుగా అన్నీ తీరుస్తుంది. ఈ రోజు అమ్మ నవ్వును చంద్ర బిమ్బములో చూచిన వాడు ధన్యుడు.
ఈ రోజు అందరూ ఆ తల్లికి పంచ పూజలు చేసి, ఐదు సార్లు లలిత సహస్రనామ పారాయణ చేయవలెను. అలా చేసిన వారికి,
యత్రాస్తి భోగోన చ తత్ర మోక్షః
యత్రాస్తి మోక్షో న చ తత్ర భోగః
శ్రీ సుందరీ సేవన తత్పరాణాo
భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ
నిష్కామముగా పారాయణ చేసిన వారికి బ్రహ్మ జ్ఞానము, ధనార్ధికి ధనము, కీర్తిని కోరువారికి కీర్తిని, విద్యను కోరువారికి విద్య, భోగము కోరుకోనువారికి భోగము, మోక్షము కోరుకోనువారికి మోక్షము సిద్ధించును.
అందరూ ఆ తల్లి యొక్క పరి పూర్ణ అనుగ్రహమును పొందెదరు గాక. మాయను తొలగించి బ్రహ్మ విద్యను ప్రసాదించే తల్లి ఈ తల్లి.
అమ్మ ఉపాసన మొదలు పెట్టాలను కొనే వారికి మంచి సుదినము ఈ రోజు. ఆ చిత్కళ దొరికేరోజు ఈ రోజు. అమ్మ కాళ్ళు పట్టుకోండి, మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు.
జగత్తు అంతా అమ్మ మయం . అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే.
మీ
శ్రీ భాస్కరానంద నాథ