Monday 13 January 2014

శ్రీకాళహస్తి – దక్షిణ కైలాసం -2



ఆలయ నిర్మాణ పద్ధతి :-
భారత దేశమందలి ఆలయముల వలే గాక శ్రీ కాళహస్తీశ్వర ఆలయ నిర్మాణములో నొక ప్రత్యేకత గలదు. ఇచ్చట వినాయకుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు, దక్షిణామూర్తి, అమ్మవార్లు ఒక్కొక్కరు ఒక్కో దిక్కునకు వెలసియున్నారు. దీనిని బట్టి జీవులు తరింప బడుటకు మూల మగు ధర్మార్ధ కామ మోక్షములను చతుర్విద పురుషార్ధ సూచనమే ఈ దేవాలయమని మనస్సునకు తోచు చున్నదని పెద్దల నమ్మిక. మొదటి దిన ధర్మము, ఆత్మ ధర్మముగా ఉత్తరాభి ముఖమైన శ్రీ పాతాళ గణపతి ఉనికిలో తెలియనగును. రెండవ అర్ధము ఆత్మ జ్ఞానోపదేశానార్ధముగా ఉమా దేవి స్వరూపమైన శ్రీ జ్ఞాన ప్రసూనామ్భికా దేవి తూర్పు ముఖముగా నిలిచి ముముక్షువులకు భోధించు చుండును. మూడవదయిన కామము దక్షిణ ముఖముగా నుండి మహా ద్వారమునకు ఎదురుగా సత్య శివ సుందర దక్షిణామూర్తిగా, గురు స్వరూపములో జీవులకు ఇహ పర కార్యంబులు సిద్దించుట తధ్యమని తెలుపు చున్నారు.   
తుదిగా మోక్షాధికారి అయిన పరమ శివుని స్వరూపమగు శ్రీ కాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖముగా నిలిచి అస్తమయ సూర్యుని మూలమున జీవునకు మరణము తధ్యమని తెలుపుచూ, శివ సాయుజ్య ప్రాప్తికి ప్రయత్నం జేయవలెను అని మనకు సూక్ష్మ సందేశము ఇచ్చు చున్నాడు.  ధర్మార్ధ కామ మోక్షములకు ఒక ప్రతీకయే శ్రీ కాళహస్తీశ్వరాలయము.
శ్రీకాళహస్తీశ్వర మహత్యము:-
శ్రీ కాళహస్తీశ్వర స్వామి స్వయంభువు. శ్రీ అనగా సాలె పురుగు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ మూడు జంతువులు శివ భక్తి వలన సాయుజ్యము పొంది శివునిలో కలిసి పోయినవి. అందువలన ఇచ్చట స్వామి వారికి శ్రీ కాళహస్తీశ్వరుడనియు, ఈ పురమునకు శ్రీ కాళహస్తీ అనియు పేరు వచ్చెను.
సాలె పురుగు – శివ సాయుజ్యము:-
కృత యుగములో చెలది పురుగు తన శరీరము నుంచి వచ్చు సన్నని దారముతో కొండపై నున్న శివునకు గుళ్ళు గోపురములు ప్రాకారములు కట్టి శివుని పూజించు చుండెను. ఒకనాడు శివుడు పరీక్షించదలచి అక్కడ మండుచున్న దీపము తగిలి సాలీడు రచించిన గుడి గోపురములు తగుల బడి పోవునట్లు చేసెను. ఇది చూసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రత్యక్షమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనేను. అప్పుడు సాలీడు తనకు మరల జన్మ లేకుండా చేయమని కోరుకొనగా, శివుడు సమ్మతించి సాలీడును తనలో ఐక్యము చేసుకొనెను. ఈ విధముగా సాలీడు శివ సాయుజ్యము నొందినది.
నాగు పాము – ఏనుగు శివారాధన చేసి తరించుట:-
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది. ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినమున శివ లింగమునకు పూజ చేసి పోవుచుండెను. త్రేతాయుగము ముగిసి, ద్వాపర యుగము వచ్చినది. అప్పుడు ఒక ఏనుగు శివ లింగమునకు పూజ చేయ తలచి సువర్ణ ముఖి నదిలో స్నాన మాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వ దళములు తెచ్చి, పాము సమర్పించిన మణులను త్రోసి వేసి, తాను తెచ్చిన నీటితో అభిషేకించి పుష్పములతో నలంకరించి పూజించి వెడలి పోవు చుండెను. మరునాడు ఉదయం పాము వచ్చి తాను  పెట్టి వెళ్ళిన మణులను గానక దానికి బదులు బిల్వములు, పుష్పములు గాంచి పాము మనస్సు చాలా బాధపడి, యధాప్రకారముగా వాటిని త్రోసి వేసి, శివున్ని మణులతో పూజించెను. ఇలా కొంత కాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు, ఏనుగు ఉంచిన పూలను పాము శుభ్ర పరచి తమ ఇచ్చానుసారముగా పూజ చేసి శివున్ని ఆరాధించు చుండెను. ఒక రోజు పాము విసుగు చెంది తన మణులను తొలగించిన ఆ ప్రాణి పై కోపము చెంది కారణము తెలుసుకోన గోరి ప్రక్కనే యున్న పొదలో దాగి పొంచి ఉండెను. అంత వాడుక ప్రకారము ఏనుగు పూజకు వచ్చి, తన పూజ మొదలు పెట్టెను. తొండముతో మణులను త్రోసి వేయుచుండెను. అది గమనించిన పాము కోపముతో తన శత్రువైన ఏనుగు తొండములో దూరి కుంభస్థలమున నిలిచి దానికి ఊపిరి ఆడకుండా చేసెను. ఈ బాధకు ఏనుగు తాళజాలక ఈశ్వర ధ్యానముతో తొండముతో శివ లింగమును తాకి శిరస్సును గట్టిగా రాతికి మోది తుదకు ప్రాణములను విడిచెను. ఆ శిలా ఘాతమునకు పాము గూడా చచ్చి బయట పడినది. పరమ శివుడు వాటి భక్తికి మెచ్చి రెంటికీ మోక్షమును ప్రసాదించెను. ఇద్దరు తమ నిజ స్వరూపములతో రుద్ర గణములుగా మారి స్వామి వారిలో ఐక్య మొందిరి.
ఈ స్మృతి చిహ్నముగా పాము శిరోభాగమున, ఏనుగు సూచకముగా రెండు దంతములు, సాలె పురుగు అడుగు భాగమున తన లింగాకృతిలో ఐక్య మొనరించుకొని శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా నాటి నుంచి దర్శనమిచ్చు చున్నాడు. ఆనాటి ఈ పుణ్య క్షేత్రము “శ్రీకాళహస్తీ” అని పేరు గాంచెను.
హర నమః పార్వతీ పతయే నమః
ఇంకా వుంది....... మీ
శ్రీ భాస్కరానంద నాథ/శ్రీకాళహస్తి  //  http://vanadurga-mahavidya.blogspot.in/






Sunday 5 January 2014

నాయన - శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని జీవిత చరిత్ర



నాయన - శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని జీవిత చరిత్ర-దీనిని రచించిన వారు శ్రీ గుంటూరు లక్ష్మికాంతము గారు. 

నాయన - భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి ముఖ్య శిష్యులలో ప్రధమముగా చెప్పుకోవలసిన వారు. 

శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని 17-11-1878 లో జన్మించిరి.

వీరు తమ పదియేండ్ల వయసు నందే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదము నందు అసమాన ప్రతిభ చూపినారు.

వీరి యొక్క వాక్చాతుర్యము, సంస్కృత భాషా ప్రావీణ్యము మరియు అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభతో - నవద్వీప మందు విద్వత్పరీక్ష లందు పాల్గొని 'కావ్యకంఠ' బిరుదమును పొందిరి.

వివిధ ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు. 

అయినను ఇంకా సంతృప్తి పడక - ఈశ్వర ప్రేరణమున, అరుణాచలము (తిరువన్నామలై) లో, 18-11-1907 న బ్రాహ్మణ స్వామిని (వేంకటరామన్) కలిసి '....... తపస్సాధన స్వరూపము కొఱకు అర్ధించుచు మిమ్ములను శరణువేడుచున్నాను.... ' అని తమిళ భాషలో అడిగిరి. అప్పటిదాకా పెక్కు సంవత్సరములు మౌనముగా వున్న బ్రాహ్మణ స్వామి:

1. " 'నేను, నే' ననునది యెచ్చటనుండి వచ్చుచున్నదో విచారించినయెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు. 

2. జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చటనుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము." అని మితాక్షరములతొ తమ ఉపదేశవాణిని తమిళ భాషలో వెలువడిరి.

గణపతిముని వేంకటరామన్ అను నామమమును 'రమణ' అని మార్చి, 'భగవాన్ శ్రీ రమణ మహర్షి' అను పూర్ణ నామమును సమకూర్చి, 'శ్రీ రమణపంచక' మను శ్లోక రత్నములను అప్పటికప్పుడు కూర్చి రమణుని హస్తమందుంచి 'మీరిది స్వీకరించి నన్ను ఆశిర్వదింతురు గాక' అని పలికెను. 

'సరే, నాయనా' యని రమణుడు దానిని స్వీకరించెను.

అప్పటినుండి బ్రాహ్మణ స్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి గాను, కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని నాయన గాను పిలువబడుచుండిరి. జగత్ప్రసిద్దులయిరి.

తదుపరి గణపతి ముని భగవాన్ శ్రీ రమణ మహర్షి అనుగ్రహము వలన చూత గుహలో కపాల భేద సిద్ధి పొందిరి (1922 వేసవి).

గణపతిముని ఉమా సహస్రము, శ్రీ రమణ గీత, శ్రీ రమణ చత్వరిమ్సత్, ఇంద్రాణి సప్తశతీ, మహా విద్యాది సూత్రావళి, గీతమాల, విశ్వమీమాంస, మొదలగు గ్రంధములను రచించెను. మరియు భగవాన్ శ్రీ రమణ మహర్షి సంస్కృతములో రచించిన 'ఉపదేససారము' నకు వ్యాఖ్యానము రచించిరి.

'నాయన' అను ప్రియ నామముతో ప్రకాశించిన శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని 25-07-1936న తమ భౌతిక శరీరమును వీడిరి. 

ఈ దివ్యపురుషుని భౌతిక దేహమంతరించినను, తన గ్రంధములందు బోధరూపమున ప్రకాశించుచున్నారు.

నాయన కలకత్తా కి 24-11-34 న వచ్చి శ్రీ గుంటూరు లక్ష్మికాంతము గారి ఇంట్లో బస చేసితిరి. వీరి ఆదరాభిమానములకు సంతసించి, నాయన షుమారు ఒకటిన్నర సంవత్సరములు కలకత్తా లో వీరి దగ్గర వుండిరి. ఆ సమయములో ప్రతిరోజూ నాయన వీరికి అనేక ముఖ్య విషయములను బోధించెడివారు.. ముఖ్యముగా లక్ష్మికాంతము గారి కోరిక మేర నాయన గారు స్వయముగా తమ జీవిత చరిత్ర, ఉమా సహస్రము నకు అర్ధము మరియు వ్యాఖ్యానము,ఇంద్రాణి సప్తశతీ యొక్క అర్ధము మరియు వ్యాఖ్యానము, విశ్వమీమాంస వివరణము, మొదలగు విషయములు బోధించిరి. గణపతి ముని గారు (వీరనారి సత్యప్రభ అను కథను) 'పూర్ణ' అని సంస్కృత భాష యందు వ్రాసి, 'పూర్ణ' అని తెలుగులో వ్రాసిరి. (ఈ కథను భారతి పత్రికలో అచ్చు వేసిరి).

గణపతిముని నిర్యాణము తరువాత గుంటూరు లక్ష్మికాంతము గారు తరచూ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొద్దకు వచ్చుచుండెడి వారు. 

భగవాన్ శ్రీ రమణ మహర్షి స్వయముగా లక్ష్మికాంతమును ఆశీర్వదించి, పలు వ్యక్తులను కలిసి నిజ నిర్ధాణము చేసుకొని, ఈ జీవిత చరిత్రను వ్రాయమని ఆదేశించిరి. 

ఈ జీవిత చరిత్ర మొదట 1958 లోను, తదుపరి 1964,1998,2001 మరియు 2013 ప్రచురింపబడినది.

వేల రూ 250/- + Postage. ప్రతులకు jvslakshmi@gmail.com సంప్రదించండి. ధన్యవాదములు

 

​Phone:-  09840119425​


--

మీ

శ్రీ భాస్కరానంద నాథ