Sunday 27 April 2014

సౌందర్యలహరి- 4

సౌందర్యలహరి- 4
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

శ్లో|| త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా |
భయాత్త్రాతుం దాతుం ఫలమపి చ  వాంఛాసమధికం   
శరణ్యే లోకానాం తవ హి చరణా వేవ నిపుణౌ ||  ౪


తా: భగవతీ! లోకమాతా! ఇంద్రాదులైన దేవతాగణం తమ హస్తాలలో అభయ వరముద్రలను ధరించి వరాలను, అభయాన్ని ప్రసాదిస్తున్నారు. నీవు మాత్రం హస్తాలలో ఎలాంటి వరాభయముద్రలను ధరించ లేదు. కారణం, ఓ తల్లీ ! భక్తులను భయం నుంచి రక్షించడానికి వారు కోరిన దానికన్నా ఎక్కువ  ఫలాన్నిఒసగడానికి, నీ పాదములు ఎంతో నైపుణ్యము కలిగి వున్నాయి కదా.
భాస్కరానంద భావము (భా.భా)
సకల జగత్తుకు మూల కారణమైనటువంటి మూల ప్రకృతి, వేద వేద్య అయినటువంటి ఆ శ్రీమాత ఇతర దేవతల వలె అభయ, వరద ముద్రలను ధరించ లేదు. కారణం ఆమె అమ్మ. అమ్మతనం గొప్పది అన్నింటి కంటే. ఇటువంటి సాంప్రదాయాలకు, ముద్రలకు భిన్నమైనటు వంటిది అమ్మ తనం. వరము లేదు, అభయము లేదు. అమ్మా అని ఆర్తితో పాదాల పై పడ్డ  పసి బిడ్డను, నాయినా తండ్రీ అని అక్కున చేర్చుకోనేదే అమ్మ తనం. ఆ చల్లని ఒడిలో అన్నీ అభయాలే వరములే. మరి వేరే కావాలనా. అమ్మ ఒడిని మించినది ఏమున్నది మనకు. అందుకే ఏ ముద్ర దాల్చ లేదు, ఒక్క చిరు నవ్వు తప్ప.  ఆమె పాదాల పై పడి ఏడిస్తే చాలదా అమృత వర్షం కురిపించడానికి ఆ అమృతవర్షిని.
మరలా అడగాలా అది కావలి ఇది కావాలి అని. అడిగి మ్రోక్కించుకోవడం మా అమ్మకు చేత కాదు. అడగ కుండానే అన్నీ ఇచ్చేస్తుంది ఒక్క సారి అమ్మా అంటే చాలు కన్నీళ్ళతో.
శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళికాయై నమః, హరి బ్రహ్మేంద్ర సేవితాయై నమః. అనుగ్రహదాయైనమః.
రాగము అనే పాశము, క్రోధము అనే అంకుశము, మనస్సు అనే ఇక్షు దండము, పంచ తన్మాత్రలు కలిగి చతుర్భాహు సమన్విత అయినటు వంటి ఆ భయాపహా కు  నమస్కారములు.
సామాన్యంగా దేవతల విగ్రహములను పరిశీలిస్తే కుడి చేతిలో అభయ ముద్ర, ఎడమ చేతిలో వరద ముద్ర వుంటుంది. అభయముద్ర అంటే చేతి వ్రేళ్ళు ఊర్ధ్వ ముఖంగాను, వరద ముద్ర అంటే చేతి వ్రేళ్ళు అధోముఖంగా ఉన్న హస్త ముద్ర.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.

భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.