Sunday 27 April 2014

సౌందర్యలహరి- 5

సౌందర్యలహరి- 5
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.


శ్లో|| హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్‌ |
స్మరో పి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్‌ ||

అమ్మా ! ఓ జననీ నీకు నమస్కరించే నీ భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తావు. పూర్వం శ్రీ మహావిష్ణువు నిన్ను ఆరాధించి స్త్రీ రూపాన్నిధరించి,  త్రిపురాసురులను సైతం సంహరించిన జితేంద్రియు డైన శివున్ని కూడా కలత పెట్టాడు, క్షోభ పెట్ట గలిగాడు.
అలాగే మన్మధుడు కూడా నిన్ను కొలిచి తన సతి అయిన రతి దేవి కన్నులను, మనస్సును రంజింప చేయగల సౌందర్యాన్ని పొంది, ఆ రూపముతో మునీశ్వరుల మనస్సును సైతం మొహపెట్ట గలుగుచున్నాడు. ఇది అంతా నీ ప్రాసాద మహిమే కదా తల్లీ.

భాస్కరానంద భావము (భా.భా)

ఎవరైతే నీకు వినమ్రులై, వినయ విధేయతలతో నిన్ను నమస్కరిస్తూ ఉంటారో వారిని నీవు అనుగ్రహిస్తూ వుంటావు తల్లీ.
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా ....అని లలితా సహస్రనామం లో అమ్మకు ఒక నామం. అమ్మ చిరు నవ్వు యొక్క కాంతి ప్రవాహమునందు కామేశ్వరుని యొక్క మనస్సు ఓలలాడుతూ వుంటుంది.

అమ్మ నవ్వుకు అయ్య దాసోహం అయినాడు అని. పూర్వం ఒకసారి శివుడు త్రిపురాసులను సంహరించి కైలాసానికి తిరిగి వస్తాడు. ఆ ప్రళయ భీకర ఉగ్ర రూపాన్ని చూచి దేవతలు అందరూ తల్లడిల్లి పోతారు. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఎవ్వరికీ సాద్యం కాలేదు. ఆ సమయంలో అమ్మ లోపలి నుండి బయటకు వచ్చి ద్వారానికి ఒక ప్రక్క ఓరగా నిలబడి అయ్య వారి మీద ఒక చిరు నవ్వు విసిరినది. అంతే మన ప్రళయ శంకరుడు కాస్త ప్రణయ శంకరుడు అయినాడు. అలా అమ్మ వారు తన చిరు నవ్వుతో అయ్యగారి మనసు దోచుకొన్నది.  అప్పటి నుంచి భార్య చిరునవ్వు భర్త కోపానికి సరైన మందు ...అని మన పెద్దలు అంటూ వుంటారు.
 శ్రీ మహావిష్ణువు ఒక సారి ఆ మహా లావణ్య శేవధి: ని  తపమాచరించి ఆమె సౌందర్యాన్ని తాను పొంది మోహినీ రూపంలో రాక్షసుల నుంచి అమృతాన్ని రక్షించి దేవతలకు పంచిపెడుతాడు, అదే మోహినీ రూపంతో ఆ పరమ శివున్ని కలత పెట్టి హరిహర సుతునకు కారణజన్ములు అవుతారు.
శ్రీ మహా విష్ణువు శ్రీదేవీ ఉపాసకుడు. పంచదశాక్షరీ  మంత్రాన్ని విష్ణువు, శివుడు, మన్మధుడు, బ్రహ్మ, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, అగస్త్యుడు, స్కందుడు, ఇంద్రుడు, బలరాముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు మొదలగు వారు ఉపాసన చేసినారు అని దేవీ తంత్రములు చెప్పు చున్నవి.
శ్రీ మహా విష్ణువు కామ కళా మహా మంత్ర బీజమగు ఈంబీజమును ఉపాసించి సాక్షాత్తు శ్రీ దేవీ యోక్క్ చతుషష్టి కళలను పొంది  ఆమె రూప లావణ్యములను  బడిసి మోహినీ రూపము దాల్చెను.

విష్ణు: శివః సుర జ్యేష్టో మనుశ్చంద్రో ధనాధిపః |లోపాముద్రా తథాగస్త్యః స్కందః కుసుమసాయక|
సురాధీశో రౌహిణేయో దత్తాత్రేయో మహా మునిః|దుర్వాసా ఇతి విఖ్యాతా ఏతే ముఖ్యా ఉపాసకాః ||

హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః.......అని లలితా సహస్రంలో చెప్ప బడినట్లుగా ఈశ్వరుని మూడవ నేత్రము చేత కాలి బూడిద అయిన మన్మథున్ని మరల బ్రతికింపుమని బ్రహ్మాది దేవతలు, రతీ దేవి ఆ పరాశక్తిని ప్రార్ధింపఁగా , భండాసుర వధానంతరము లలితాంబ చేత మరలా మన్మధుడు పునర్జీవుతుడు గావించ బడ్డాడు. (పూర్వము శరీరము కలవాడనియు, ఇప్పుడు శరీర రహితుడనియు అర్ధము.) అట్టి మన్మధ జీవనమునకు పరదేవత కటాక్షము సంజీవినీ మూలిక వంటిది అని భావము,
అంటే శ్రీ దేవీ ఉపాసన వలన అవిద్యా స్వరూపమైన తన పూర్వ రూపము హర నేత్రాగ్ని చేత భస్మము అయ్యి, బ్రహ్మ స్వరూపము, మోక్ష రూపము పొందినది అని కూడా అర్ధము. మన్మధునికి స్థూల రూపము పోయి, సూక్ష్మ రూపము వచ్చినది,
మరో విశేషమేమిటంటే ..పరమశివుడు కూడా శ్రీవిద్యోపాసకుడు, గురువు లేకుండా ఉపాసన జరుగదు కనుక త్రిపుర సుందరియే అతనికి గురువు. (యోగినీ హృదయం). అందువలన ఆమె శివునికి కూడా గురువు అగుచూ గురుమూర్తి అయ్యినది. గురుమూర్తి, దక్షిణామూర్తి రూపిణి అని లలితా సహస్రనామలలో కలవు. అనగా ఆ పరదేవతయే గురు స్వరూపములో వున్నది. ఆ పరమ శివునికి కూడా గురువై గురుమండల రూపిణీ అయ్యి వున్నది. హరి కోపించిన గురువు రక్షించును, గురువు కోపించిన రక్షించు వారు ఎవ్వరూ లేరు అన్నట్లుగా,
శివుడు కోపించినా గురు మండల రూపంలోని అమ్మ మన్మధున్ని రక్షించినది అని అర్ధం చెప్పుకోవచ్చును.
అనగా మాయ, ఆత్మ జ్ఞానమును క్రప్పి పుచ్చు చుండును, కావున జ్ఞానాగ్ని చేత దహింపబడి కాముడు అనబడే  జీవుడు, దానిని చుట్టి వున్న మాయ నుండి విముక్తిని పొంది స్వ స్వరూపమును పొందినాడు. శ్రీవిద్యా స్వరూప మైన దేవిని ఉపాసించుట వలన అవిద్య నశించి ఆత్మ రూపమును పొందుటయే మోక్షము అని దీని భావము. మన్మదుడుకి ఆ శక్తి ఆ తల్లి వలెనే లభించినది అని మనము చెప్పుకోవలయును.
ఇప్పుడు మన్మధుడు మనస్సు చేత జితేంద్రియులైన మునులను సహితమును అంతరంగమున మోహము కలిగించు చున్నాడు. అనగా శబ్దాది ఇంద్రియ విషయము లందు, వాంఛ లయందు, మనస్సు మోహ వశ మగు చున్నది అని భావము. మునీశ్వరులను సైతం మోహింప చేయగల సమర్ధుడు అయినాడు మన్మధుడు అంటే అది అంతా శ్రీమాత యొక్క అనుగ్రహమే. అమ్మ అనుగ్రహము చేత ఈ మాయా మోహమును దాట వేయ వచ్చును.
ప్రణత జన సౌభాగ్య జననీం ....దీని విశేష అర్ధం ఏమిటంటే శ్రీ దేవి ప్రణత జనులకు సౌభాగ్యాన్ని ఇస్తుంది, మరి ప్రణత జనులు అంటే ఎవరు? త్రికరణ శుద్దిగా నమస్కరించే వాళ్ళు అని. అలా త్రికరణ శుద్దిగా నమస్కరిస్తే ఆమె మనకు సౌభాగ్యమును ప్రసాదిస్తుంది. అంటే కొలిచెడి వారికి కొంగు బంగారమై సకల సౌభాగ్యములను తీర్చే తల్లి అని అర్ధము. మరి సౌభాగ్యము అంటే సౌందర్యము, సత్సాంతానము, సకల విద్యా ప్రాప్తి మొదలగు సంపదలు అన్నీ అమ్మ మనకు అనుగ్రహిస్తుంది.
జననీం అని అనడంలో అర్ధం మాతృత్వం. మాత అన్నా జననీ అన్నా ఒకటే అర్ధం, కానీ భగవత్పాదులు ఇక్కడ జననీం అని అనడంలో ఒక ఔచిత్యము వున్నది.
జననీం అంటే పుట్టుక, జన్మ, పునర్జన్మ అనే అర్ధాలు గోచరిస్తాయి.
జన్మకు కారణభూతురాలు అవుతున్నది అమ్మ. జననీ అంటే తల్లి, దయ అని రెండు అర్ధములు వస్తాయి. దయ గల తల్లి, కారుణ్యమూర్తి. మరి ఎక్కడ ఆ తల్లి జననీo అయ్యినది ఈ శ్లోకములో.
౧. విష్ణువు కామకళా బీజ మంత్రాన్ని ఉపాసించి అమ్మ రూపాన్ని పొంది మోహినీ రూపంలో హరున్ని కలవగా అయ్యప్ప స్వామి జనించినాడు. ఇక్కడ జననీం అయ్యినది అమ్మ.
౨. రుద్రాగ్నికి బూడిద అయిన మన్మథునికి  కరుణతో, దయతో పునర్జన్మ ప్రసాదించి రెండో మారు జననీం అయ్యినది.
హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధిః.. అయినది మా అమ్మ.
విష్ణువు అమ్మను ఉపాసించడం వలన స్త్రీ రూపం పొంది అమ్మతో సారూప్యం పొందినాడు, అందుకే శివుడు ఆ రూపాన్ని చూచి ఆమెను పార్వతిగా భావించి మొహాన్ని పొందినాడు అని పెద్దలు అంటారు.
రతి నయన లేహ్యేన:- రతీ దేవి కన్నులచే ఆస్వాదింప దగినది అని అర్ధము. లేహ్యము అంటే నాకి భుజింప దగిన పదార్ధము, అమృతము, నాక దగినది, నాలుకతో తినగలిగినది. నయన లేహ్యన అంటే కన్నులతో తినగలిగినది, నాలుకతో చప్పరించేది అంటే కన్నులతో జుర్రుకొనడం అనుకోవచ్చును. అంటే ఆమె మనో నేత్రమునకు మాత్రమే కనిపించ దగినది మన్మధ శరీరము అని అర్ధము.

విశేష వాఖ్య :- అమ్మ ను పూజించిన వాళ్ళకు మన్మధుడి బాధ వుండదు అని ఈ శ్లోక రహస్యం.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.

భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.