Sunday 27 April 2014

సౌందర్యలహరి- 6

సౌందర్యలహరి- 6
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.


శ్లో|| ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసంత స్సామంతో మలయమరు దాయోధన రథః |
తథా ప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్‌
అపాజ్గాత్తే లబ్ధ్వా జగ దిద మనజ్గో విజయతే || 6


ఓ హిమగిరి కుమారీ! మన్మథుడి విల్లు పువ్వులతో రూపొందించబడినది; వింటినారి తుమ్మెదల శ్రేణి; పుష్ప నిర్మితమైన బాణాలూ ఐదు అతడి అమ్ముల పొది; కాలబద్ధుడై మళ్ళీ మళ్ళీ వచ్చే వసంతుడు అతడి సామంతుడు; అతడి యుద్ధరథం నిరంతరం చలించే రూపులేని మలయమారుతం; ఇలా పనికిరాని యుద్ధ పరికరాలు కలిగిన మన్మథుడు అంగ రహితుడు; బలిష్టమైన మేను లేని వాడు. అయిననూ, నిన్నారాధించి, నీ కడగంటి కటాక్షంతో ఈ జగత్తును తన ఆధీనములోనికి తెచ్చుకుంటున్నాడు.

భాస్కరానంద భావము (భా.భా)
హిమ గిరి సుతే ....
హిమ గిరి తనయే, హైమవతీ అని మొదట సారి జగద్గురువులు ఈ శ్లోకములో అమ్మను నామ వాచకముతో పిలుస్తున్నాడు. మొదటి ఐదు శ్లోకములలో అమ్మను పర బ్రహ్మ స్వరూపముగా, మహా శక్తిగా అభివర్ణించిన,  భగవత్పాదులు ఇప్పుడు హిమ గిరి తనయే.. అని పిలుస్తున్నాడు. అమ్మ ఎవరో అమ్మ ఉనికి ఏమిటో మనకు చెబుతున్నాడు. హిమగిరి తనయే హేమలతే  అంబా ...పర్వత పుత్రీ పార్వతీ అని పిలుస్తున్నాడు.  సగుణ రూపం లో అమ్మను ఆరాధిస్తూ మనకు చూపిస్తున్నాడు.
హిమగిరి తనయే హేమలతే అంబా ఈశ్వరి శ్రీ లలితే మామవ...అనే ముత్తయ్య భాగవతార్ పాడిన          కీర్తన నాకు గుర్తు కు వస్తున్నది
హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీ లలితే మామవ
రమా వాణి సంసేవిత సకలే రాజ రాజేశ్వరి రామ సహోదరి
పాశాంకుశేషు దండ ధరే అంబ పరాత్పరే నిజ భక్త పరే
అశాంబర హరికేశ విలాసే ఆనంద రూపే అమిత ప్రతాపే.

భగవంతుడు గొప్పా ? భక్తుడు గొప్పా అని ఆలోచిస్తే,  నాకు భక్తుడే గొప్ప అని అనిపిస్తున్నది ఎందుకో.

మన్మధుడు అంటే  మనస్సును మధించిన వాడు, లోకాలను జయించ డానికికి బయలు దేరినాడు అస్త్ర శస్త్రములతో రధము నెక్కి. ఆ రధము ఎలా ఉన్నదో, అస్త్ర శస్త్రములు ఎలా వున్నాయో జగద్గురువులు వర్ణిస్తున్నారు.

ధనుస్సు గట్టిగా వుండాలి కాని అదేమో పుష్ప ధనుస్సు, పూలతో చేయబడినది, దానికి గట్టితనం లేదు, వంచడానికి వీలు లేదు, వింటి నారి చూస్తే తుమ్మెదల వరుస, లాగడానికి వీలు లేని అల్లె త్రాడు. బాణాలు అయిదు అవి తామర పువ్వు, అశోకము, మామిడి, నవ మల్లిక, నల్ల కలువ అనే పుష్ప బాణాలు, తగిలినా గట్టిగా గ్రుచ్చుకోవు, శరీరానికి గాయాలు కావు, కేవలం  అయిదు బాణాలతో లోకాన్ని జయించడం అసలు వీలుకాని పని.

పోనీ సహాయకుడు గట్టివాడా అంటే అతను వసంతుడు, వసంత కాలం లో తప్పించి అంటే సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే కనిపిస్తాడు, ఇతర కాలాలలో అందుబాటులో ఉండడు, సహాయము చేయలేడు, పోనీ ఎక్కిన రధము అన్నా గట్టిగా ఉందా అంటే అది మలయ మారుతము, మలయ పర్వతము దగ్గరే వుంటుంది, అక్కడి నుంచి బయటకు రాదు, పైగా అన్ని సమయాలలో వీయదు, అది ఎటు వీస్తే అటే పోవాలి గాని లక్ష్యం వైపు వెళ్ళదు. శత్రువు వైపు వెళ్ళదు కాబట్టి మలయ మారుతం రధముగా పనికి రాదు.

పోనీ శరీరం అన్నా గట్టిగా ఉందా అంటే అదీ లేదు, అనంగుడు అంగములు లేని వాడు, శరీరము లేని వాడు
కాళ్ళు, చేతులు లేని వాడు, మరి ఇన్ని అవలక్షణములు వున్నవాడు ఎలా లోకాలను జయించాడయ్యా అని అంటే,

 అమ్మ దయ వుంటే ఎంతటి దుర్భలుడయినా ఎటువంటి కార్యాన్ని అయినా సాధించ గలడు అని అర్ధము. ఇదంతా నీ కడగంటి చూపు గొప్పతనము కాక మరి ఇంకేమున్నది?

అమ్మ కరుణాకటాక్షము వలన మన్మధుడు ఈ లోకాలను అన్నింటిని జయిస్తున్నాడు. స్త్రీ పురుషులను కామ పరవశుల్ని చేస్తున్నాడు.
విజయమునకు కావలసిన సామగ్రి లేకున్ననూ అమ్మ అనుగ్రహము వుంటే విజయము తధ్యము అని చెప్పినారు గురు దేవుళ్ళు.
అమ్మ కృప దొరికితే ఎంతటి అల్పుడు అయినా ఎంతటి ఘన కార్యాన్ని అయినా సాధించ గలడు అని ఆది శంకరులు మనకు చెబుతున్నారు ఈ శ్లోకములో.
అపాంగాత్తే లబ్ధ్వా ... అపాంగము అంటే కడ కన్ను అని అర్ధము.

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.
సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ



No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.