Saturday 5 July 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 28

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 28

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః |
కరాళం యత్‍క్ష్వేళం కబలితవతః కాలకలనా
న శంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా || 28 ||

తల్లీ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకల దేవతలూ భయంకరమైన జరామృత్యువులను హరించే అమృతాన్ని గ్రోలి ప్రళయకాలంలో మరణిస్తున్నారు. అతిభయంకరమై లోకాలను దహించే కాలకూటమనే మహావిషాన్ని భక్షించిననూ నీ పతి శంభుడికి (శివుడికి) మరణం సంభవించలేదు. ఇందుకు ముఖ్యకారణం నీ చెవులకు భాసిల్లే రత్నతాటంకాల (రత్నాల కమ్మల) ప్రభావమే కదా! (నీ తేజస్సు మహిమ అంత అద్భుతమైనదని భావము).

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క తాటంక మహిమ గురించి   మనకు తెలియ జేస్తున్నారు.
తాటి + ఆకు = తాటాకు. తాళి, తాటంకములు ఇవన్నీ తాటి ఆకు లో నుంచి వచ్చిన పదములు. తాటంకములు అంటే చెవి కమ్మలు.  ఇవి మంగళ సూచకములు. పూర్వపు రోజులలో తాళి, తాటంకములు అన్నీ తాటి ఆకుతో చేసినవే. తాళ పత్రములు అంటే తాటి ఆకులు, వీటి మీదనే మన శాస్త్రములన్నీ మనకు అందించ బడినాయి. కాగితము లేని రోజులలో ఈ తాళ పత్రములనే వాడే వాళ్ళు. తాళ పత్ర గ్రంథములు అని వాటిని పిలిచేవారు. పూర్వపు రోజులలో మరియు ఇప్పటికీ భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవము ఈ తాటాకు పందిళ్ల క్రిందనే జరుగుతుంటాయి. విసన కర్రలు కూడా ఈ తాటాకు తోనే చేస్తారు. ముఖ్యముగా శ్రీ రామ నవమి నాడు ఈ విసన కర్రల వినియోగము చాలా ఎక్కువగా వుంటుంది. తాటాకు చేసిన విసనకర్రలను పేద బ్రాహ్మణునికి దానం ఇస్తే మహా పుణ్యము. వడ పప్పు, దక్షిణ తాంబూలములతో తాటాకు విసన కర్రలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం నేటికి ఆచారముగా వున్నది. తాటాకు తో చేసిన విసన కర్రలు చల్లని గాలిని ఇస్తాయి. చల్ల తనానికి, చలువ చేయడానికి తాటి చెట్టు ఉత్పతత్తులను విరివిగా వాడుతారు అనాదిగా. తాటాకు పందిళ్ళతో వచ్చే పెండ్లి కళ ఏ నక్షత్ర హోటలలో జరిగినా రాదు అంటే అతిశయోక్తి కాదు. 

తాటాకు తో తయారు చేసిన వస్తువులు అన్నీ మంగళ ప్రదమైనవి అని పెద్దలు చెబుతారు. తాటి ముంజలు, తాటి తాండ్ర, తాటి బెల్లం, తాటి తేగలు, తాటి విసనకర్రలు, తాటి చాపలు, పందిళ్ళు, తాటి ఆకులు, తాటి దూలాలు, తాటి గొడుగులు, తాటి ఆకు చేద, తాటి దుంగలు, తాటి ఆకు తో చేసిన బొమ్మలు, సంగీత సాధన వస్తువులు, ... ఇలా ఎన్నో గృహోపకరణ వస్తువులు వాడుతూ వుండే వారు.  ఇలా తాటాకు తో చేసిన మంగళ సూత్రములు, చెవి కమ్మలు కూడా అలాగే వాడుతూ వుండేవారు. పైగా తాటాకు తో  చేసినవి చాలా మంగళప్రదమైనవి.  మంత్రించి ఈ తాటి ఆకును మెడలో దండగా, తాయిత్తుగా కూడా ధరించే వాళ్ళు.  చెవులలో ఈ తాటాకును దూర్చుకొని ఆభరణముగా కూడా వాడే వాళ్ళు.  అలా వచ్చినవి ఈ తాటంకములు. చెవి కమ్మలు. చెవికి పెట్టుకొనే ఆభరణములు.

తమిళనాడు లోని జంబుకేశ్వరం. ఒకప్పుడు జంబు మహర్షి ఇక్కడ తప మాచరించి శివున్ని పూజించి నందువలన ఈ ఈశ్వరుణ్ణి జంబుకేశ్వరుడు అని అందురు. ఇది ఆపోలింగము.  శివ లింగము వున్న భాగములో ఎప్పుడూ నీరు ఊరుతూ వుంటుంది. జంబుకేశ్వరం లో అమ్మ వారు అఖిలాండేశ్వరి ఉగ్రకళతో చాలా భయంకరముగా ఉండేదని, తలుపులు తీయడానికి కూడా అర్చకులు భయపడుతూ వుండేవారు అని, కొంతమంది ఆమె ఉగ్రకళకు గురి అవుతూ వుండేవాళ్ళు అని పెద్దలు చెబుతూ వుండేవారు. ఇదే విషయాన్నీ వారు ఆచార్యులు వారు అక్కడకు వచ్చినప్పుడు విన్నవించుకొన్నారు. జగద్గురువులు అమ్మను ప్రార్ధించి అమ్మ యొక్క ఉగ్రకళను ఆవాహన చేసి శ్రీచక్ర రూపములో తాటంకములు చేయించి అమ్మ వారికి కర్ణాభరణములుగా అమ్మ వారికి సమర్పించినారు. అచ్చటనే వినాయకుడ్ని కూడా స్థాపించినారు అని పెద్దలు చెబుతూ వుంటారు. అప్పటి నుంచి అమ్మ ఉగ్ర రూపము పోయి సౌమ్యవతి అయినది అని కూడా చెబుతూ వుంటారు. ఇప్పటికీ అమ్మ వారి తాటంకములను తీయాలంటే మెరుగు కోసము  కంచి కామ కోటి పీఠాధిపతులు వచ్చి కార్యక్రమమును వారి చేతుల మీదుగా నిర్వర్తించేదరు అని చెప్పెదరు. అంత గొప్ప శక్తి వంతమైనవి అమ్మ తాటంకములు. మాంగల్య బలము తక్కువగా   వున్న వాళ్ళు అక్కడకి వెళ్లి అమ్మ యొక్క తాటంకములను దర్శించి వస్తే  దోషము పోతుందని గట్టి నమ్మకము. నిజము కూడా. జాతక చక్రములో అష్టమ కుజుని వలన దోషము వున్నవాళ్ళు, మాంగల్యదోషము ఉన్న వాళ్ళు ఈ క్షేత్ర దర్శనము చేసుకొని అమ్మ తాటంకములను దర్శించి, పూజించుకొని వస్తే వారి మాంగల్యం నిలబడుతుందని పెద్దలు అందురు.

అమ్మ యొక్క తాటంకములు చాలా మహిమాన్వితమైనవి. కాలమును కూడా స్తంభింప జేయును. గురువు గారు అమ్మ యొక్క చెవి కమ్మలను గురించి అత్భుతముగా  చెప్పినారు ఈ శ్లోకములో.
సూర్య చంద్రులను ఆభరణములుగా, చెవి కమ్మలుగా అమ్మ ధరించి వున్నది చెప్పినారు గురువు గారు. ఇదే విషయాన్ని లలితా సహస్రనామం లో కూడా “తాటంక యుగళీభూతతపనోడుప మండలాయై నమః”...అని చెప్పి వున్నారు వ్యాసుల వారు. కాల గమనము ఎప్పుడూ సూర్య చంద్రుల గమనము పై ఆధారపడి వుంటుంది. అటువంటి సూర్య చంద్రులను అమ్మ తన చెవి కమ్మలుగా ధరించి వున్నది. కాబట్టి కాలమును నియంత్రించే శక్తి ఆ జగన్మాతకు వున్నది. తాటంకములు చెవి కమ్మలు సౌభాగ్య చిహ్నములు, వాటిని తొలిగించే శక్తి కాలానికి కూడా లేదు.

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం..........

సహజంగా అందరూ భయపడేది ఈ జరా అంటే మూసలి తనానికి, మృత్యువునకు భయపడుతుంటారు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు అందరూ అమృతాన్ని సేవించి కూడా చివర్లో, ప్రళయ కాలంలో మృత్యు వాత పడుతున్నారు. విపద్యంతే ...అంటే విపత్తులకు లోను అవుతున్నారు.
మరి ఈశ్వరుడు కాల కూట విషాన్ని భక్షించాడు. శివుడు కాలకూట విషాన్ని త్రాగినా కాల ధర్మము ప్రకారము మృత్యువు లేదు ఆయనకు. ఎందుకని? ఎందుకు ఆయనకు జర, మృత్యువు లేదు, ఆయనకు విపత్తులు రావడం లేదు? ఎలా తట్టుకొని వున్నారు? అంత్య కాలములో కూడా ఎలా బ్రతికి వున్నారు? అంటే దానికి శ్రీ శంకర భగవత్పాదులు ఇలా అన్నారు......
అమ్మా, ఇదంతా నీ తాటంక మహిమ అని అన్నారు.

“న శంభో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా”

దీని అంతటికి అసలు రహస్యం ఏమిటంటే నీ చెవి కమ్మల యొక్క గొప్పతనము అమ్మా. మంగల్యాన్ని నిలబెట్టే శక్తి నీ చెవి కమ్మలకు వున్నది అమ్మా అని శ్రీ శంకరులు చెబుతున్నారు.
ముత్తైదువ, ఐదవ అంటే అయిదు చిహ్నములు ౧, మంగళ సూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవి కమ్మలు. ఈ ఐదింటిని ఆడవారు ఎప్పుడూ ధరించి ఉండవలెను. ఈ ఐదు లేకుండా భర్తకు, మగ వారికీ ఎప్పుడూ కనిపించ కూడదు. అమంగళము అది.
అమ్మ తన యొక్క సౌభాగ్యముచే, మహా పాతివ్రత్య ప్రభావముచే తన భర్తను కాపాడుకొంటూ వస్తున్నది అని అర్ధము.


చెవి కమ్మలు, మంగళ సూత్రము, కుంకుమ బొట్టు, ముక్కు పుడక, మెట్టెలు  మొదలైన వాటిని స్త్రీలు సదా రక్షించు కొంటూ వుండాలి, వాటి మహిమ వలన వారి భర్తలకు ఎటువంటి ఆపద కలగకుండా రక్షణ లభిస్తుంది.
అటువంటి సర్వ మంగళకు నమస్కరిస్తూ..........

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/06-07-2014 @ శ్రీకాళహస్తి
www.facebook.com/bhaskarapriya.sowndaryalahari/
http://vanadurga-mahavidya.blogspot.in/


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.