Monday 4 August 2014

సౌందర్యలహరి - భాస్కర ప్రియ – 30

సౌందర్యలహరి -  భాస్కర ప్రియ – 30
స్వదేహోద్భూతాభి ర్ఘృణిభి రణిమాద్యాభిరభితః
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః |
కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః
మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజనవిధిమ్ || 30 ||

ఓ ఆద్యంతాలులేని మాతా! నీ శరీరము  నుండి జనించిన కాంతులైన అణిమాది అష్టసిద్ధులచే పరివేష్టింప బడియున్న నీ దివ్యరూపాన్ని ఏ భక్తుడైతే పూర్తి తాదాత్మ్యంతో నువ్వే నేనని  ధ్యానిస్తాడో అతడు త్రినయనుడని పేరుగల సదాశివుడి నిండు ఐశ్వర్యాన్ని కూడా తృణీకరించగలడు. ఆ సాధకుడికి మహాప్రళయకాలంలో జ్వలించిన అగ్ని కూడా నీరాజనం గావించుతోంది.  అంటే శ్రీదేవితో తాదాత్మ్యం  పొందిన సాధకుడు శ్రీదేవియే.  ఆమెకు ప్రళయాగ్ని నీరాజనాలర్పిస్తుంది.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.

భాస్కర ప్రియ” -  (భాస్కరానందనాథ  భావము)

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు అమ్మ యొక్క ఉపాసన ఎలా చేయాలి? దాని యొక్క ఫలితము మనకు ఉపదేశిస్తున్నారు.
స్వదేహోద్భూతాభి ర్ఘృణిభి రణిమాద్యాభిరభితః
అమ్మ శరీరము నుండి పుట్టినటు వంటి అణిమాది అష్ట సిద్ధులు అమ్మ చుట్టూ చేరి నిత్యమూ అమ్మను కొలుస్తూ వుంటారు.
శ్లో:   బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ,
      మన్వశ్రదళ సంయుత షోడశారమ్,
      వృత్తత్రి భూపురయుతం పరితశ్చతుర్ద్వాః,
      శ్రీచక్రమేత దుదితం పరదేవతాయాః
బిందువు, త్రికోణము, అష్ట కోణము, దశ దళ యుగ్మము, చతుర్దశ దళము, అష్ట దళము, షోడశ దళము, త్రివలయుము, భూపురము అను వానితో  గూడి, నాలుగు ద్వారములు గలదై ఆ పర దేవతయే శ్రీచక్ర స్వరూపమై  వెలసియున్నది.
శ్రీచక్రము లో భూపుర త్రయము గలదు. మూడు రేఖలు, నాలుగు ద్వారములతో కూడినది. దీనినే త్రైలోక్య మోహన చక్రం అని అందురు. అందుకే అమ్మ వారిని త్రైలోక్య మోహన చక్ర స్వామిన్యై నమః అని అందురు.

౧. ప్రధమ భూపురము నందు అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, భుక్తి, ఇచ్చా,   
    ప్రాప్తి, సర్వకామ అనబడే అణిమాది అష్ట సిద్ధులు కలవు.
౨. ద్వితీయ భూపురము నందు బ్రాహ్మి, మహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేన్ద్రి, చాముండా, 
     మహాలక్ష్మి అనే అష్ట మాతృకలు గలరు.
౩. తృతీయ భూపురము నందు సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్శిణి, సర్వ వశంకరి, సర్వోన్మాదిని, 
    సర్వ మహాంకుశ, సర్వ ఖేచరి, సర్వ బీజ, సర్వ యోని, సర్వ త్రిఖండ, అనే దశ ముద్రలు గలవు.

అమ్మ శరీరమే శ్రీచక్రము. అమ్మే శ్రీచక్రము. అమ్మ పాదములు భూపుర త్రయము. అమ్మ శరీరము నుండి, కాదు అమ్మ పాదముల గోళ్ళ కాంతి నుండి అణిమాది అష్ట సిద్ధులు అనబడే దేవతలు ఉద్భవించినారు.

ఎటువంటి పాదములు అవి ? “పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా” ...అన్నారు వ్యాసుల వారు.
ఆ తల్లి పాదముల యొక్క కాంతిచే పద్మములు  తిరస్కరించ బడినవి. అంటే ఆ తల్లి పాదములను పట్టుకోన్నవాడు పద్మములను  కూడా అంటే లక్ష్మీ దేవిని కూడా తిరస్కరిస్తాడు అని అర్ధము చెప్పుకోవాలి. అంటే నిధిని లెక్క చేయడు. అంతటి జ్ఞానము లభిస్తుంది ఆమె పాదములను పట్టుకొన్నవాడికి. శ్రీవిద్యోపాసకుడు లౌకిక సుఖములను లక్ష్య పెట్టడు అని అర్ధము. అమ్మ పాదములను పట్టుకోన్నవాడు అమ్మ జ్ఞానము చే కాంతి చే లక్ష్మీ దేవిని కూడా ఇహ పర సుఖములను కూడా తిరస్కరించును.

నఖదీధితి సంఛన్న నమజ్జన తమో గుణా ..... అమ్మ పాదముల గోళ్ళ నుండి వచ్చే చంద్ర కాంతుల చేత బ్రహ్మాది దేవతల యొక్క తమో గుణము నశించు చున్నది. శ్రీ దేవి ఉపాసకుల యొక్క అజ్ఞానము పూర్తిగా నశించు చున్నది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ నీ పాదములను పట్టుకొని వుంటారు కాబట్టి. నీకు నమస్కరించడం వలన, నీ పాద పూజ చేయడం వలన,  నీ గోళ్ళ కాంతి చేత వాళ్ళు జ్ఞానమును పొందు చున్నారు అమ్మా. అందుకు శ్రీవిద్య బ్రహ్మ విద్య అయినది, మోక్ష విద్య అయినది. నిన్ను ఉపాసించే వాళ్లకు అణిమాది అష్ట సిద్ధులు ఒక లెక్కా . గడ్డి పరకతో సమానము అవి.
అసలు అణిమాది అష్ట సిద్ధులు ఏమిటమ్మా సదా శివుడు ఇచ్చే ఐశ్వర్యమునే తృణీకరిస్తారు వాళ్ళు.       
 శ్రీవిద్యోపాసకులు దేనినీ లెక్క జేయరు. అన్ని ఐశ్వర్యములను బూదిగా భావిస్తారు. అందుకే మహా ప్రళయములో జనించిన అగ్ని వాళ్లకు నీరాజనం పలుకుతుంది.  ఎందుకంటే నీవే వాళ్ళు. వాళ్ళే నీవు. శ్రీవిద్యోపాసకులు అంటే సాక్షాత్తు ఆ పరదేవతా స్వరూపమే. అమ్మకు శ్రీవిద్యోపాసకులకు అభేదము. ఊపిరియే శ్రీవిద్యోపాసనగా బ్రతుకుతారు కాబట్టి,  వాళ్లు మహా శక్తి సంపన్నులు. వాళ్లకు మరలా అజ్ఞానము అనేది ఉండదు. అందుకే చివరి జన్మ అయిన వాళ్ళకే శ్రీవిద్య లభించును. “చరమే జన్మని యధా శ్రీవిద్యోపాసకో భవేత్ ....అని లలితా సహస్రనామం ఉత్తర పీఠిక చెప్పు చున్నది.

ఎక్కడ మహా మోహము అనే దొంగ ఎత్తుకొని పోవునో అని భయముతో, మునులు తమ మనస్సు అనే రత్నమును అమ్మ పాదాల చెంత ఉంచుతారంట.
ఎక్కడ ప్రణయ కలహము కలుగునో అని భయపడి శివుడు అమ్మ వారి పాదముల యందు తన శిరము నుంచినాడంట. అప్పుడు అమ్మ వారి పాదములందలి సంధ్యారుణ కాంతిని శివుని జటా జూటము నందున్న చంద్రుడు గ్రహించి ఎర్రగా అయ్యెను. అటువంటి ఎరుపు నాలోని మోహ గుణమును తొలగించు గాక ...అని
మూక పంచశతీ లో మూక కవి అన్నారు.

అటువంటి మహా తల్లి పాద పద్మములకు  నమస్కరిస్తూ ....

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం.

సర్వం శ్రీ ఉమామహేశ్వరదేవతార్పణ మస్తు.
భాస్కరామ్బా సహిత భాస్కరానంద నాథ.
(సరస్వతీ రామచంద్ర రావు)/04-08-2014 @ శ్రీకాళహస్తి







No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.