Friday 28 October 2016

శ్రీవిద్యోపాసకులు

శ్రీవిద్యోపాసకులు ఎప్పుడూ తర్కించరు, వాదించరు, తప్పును ఖండిస్తారు,  చూపిస్తారు. విని తెలుసుకొంటే ఉత్తములు అవుతారు...లేదంటే ఎవరి కర్మ వాళ్లు అనుభవిస్తారు. నిత్యం మహా షోడశిీ మంత్ర జపంలో రమిస్తూ వుండే వాళ్లకి ఆడ, మగ అనే తేడా వుండదు. చిన్న పెద్ద తేడా కనిపించదు, అందరూ బాలా త్రిపుర సుందరులుగా 8 ఏండ్ల బాలబాలికలుగా కనిపిస్తూవుంటారు. ఏవ్వరి మీద అక్కసు, ద్వేషం, పగ అసలు వుండదు....పగ కక్షలు వున్న వారి దగ్గరకు కామాక్షి రాదు....అమ్మ మాతృ స్వరూపిణి...కావున అమ్మను పూజించే వాళ్లు కూడా మాతృ సమానులౌతారు. శ్రీవిద్యోపాసకులకు కల్లాకపటం తెలియదు ఎందుకంటే వాళ్లు బాలా స్వరూపులుగా, వున్నది వున్నట్లుగా మాట్లాడుతూ వుంటారు. వ్యక్తిగత పగలు ద్వేషాలు తెలియవు వారికి. సమస్త ప్రాణి కోటిని అష్టావర్ష భవేత్ అన్నట్లుగా 80 ఏండ్ల ముసలి వాళ్లు కూడా 8 ఏండ్ల బాలికామణిలాగ కనిపిస్తూ వుంటుంది. అదే శ్రీవిద్యోపాసన....నరనరాలలో అమ్మ తనం నిండిపోయివుంటుంది...జగన్మాత లాగ మాట్లాడుతూ వుంటారు.....ప్రపంచంలో వున్న కుళ్లు కుతంత్రాలను చూసి బాధపడుతూ వుంటారు, ఓక్కోసారి ఆనంద తాండవం చేస్తూ వుంటారు....కడు విచిత్రంగా ప్రవర్తిస్తూవుంటారు....మన భావనలకు అందరు...ఎవ్వరినీ గుర్తు పెట్టుకొని పగ సాధించడం అనేది అసలు వుండదు, అహంకారం వుండదు.
ఈ లక్షణాలతో అంబ పూజ చేయలేరు, నిత్య శ్రీచక్రార్చన చేయలేరు.....ఎవరిలో ఈ దుర్గుణములు వుంటాయో వారు శ్రీచక్రం ముందు కూర్చోలేరు.....తప్పు చేస్తే నెత్తి కొడుతుందని దేవీ ఉపాసకులకు బాగా తెలుసు....గురుపరంపరకు మచ్చ రానీయరు.  సాంప్రదాయ శిష్య పరంపరలో వచ్చిన ఉపాసకులను అనుక్షణం వారి గురు దేవుళ్లు, గురు త్రయం కాపాడుతూ వస్తుంది....చేసిన పొరబాట్లను గురించి తక్షణమే వారికి స్వప్న రూపంలో సమాధానాలు దొరుకుతూవుంటాయి.
శ్రీవిద్యా పూర్ణదీక్షాపరుల యోక్క మానసిక స్థితి కడు బిన్నముగా వుంటుంది...వారు అన్న ప్రతి మాటకూ ఓక అర్థం వుంటుంది....అర్థం లేకపోతే అర్థం కల్పిస్తుంది ఆ కామాక్షి ...అది ఆమే భాధ్యత.
వీరు అహంకారంతో, ఆగ్రహంతో ఏప్పుడూ మాట్లాడరు.....అయితే అలా కనిపిస్తూ వుంటారు కారణం వారి వెనుక శ్రీ భవానీ వున్నది అని నమ్మకంతో....వీరు నిద్రపోయేటప్పుడు అమ్మ ఓడిలో పడుకొని నిద్రపోతారు....పూర్ణవిద్యాపరులు అంటే సాక్షాత్తు స్వయం కామాక్షీ స్వరూపులు. ఆ స్పృహలోనే నిత్యం వారు మెదులుతూ వుంటారు,  కావున వారు అన్న మాటలు నిత్య సత్యాలు అవుతాయి...
అహం భావయే భవానీం....అని ఊపిరి పీలుస్తూ వుంటారు....అటువంటి భవానీ స్వరూపమునకు కొందరిమీద కాఠిన్యం, కొందరి మీద లాలిత్యం వుండదు....శ్రీవిద్యోపాసకులతో మాటలాడే వ్యక్తుల యోక్క భావనలు తమంతట తాముగా బయట పడుతాయి....అందుకొని చాలా జాగ్రత్తగా మసలుకోవాలి....ప్రకృతిని శాసించే మంత్ర శక్తులు వీరి దగ్గర ఎక్కువగా వుంటాయి.....వీరి శరీరం మంత్రపూరితం అయ్యి వుంటుంది, పైకి అతి సాధారణముగా కనిపించినా లోన అతీంద్రియ శక్తులతో మూల ప్రకృతితో తాదామ్యత చెంది అణుసంధానమై వుంటారు...అందుకే తమలో తాము నవ్వుకొంటూ వుంటారు....నీవు పొగడినా, తిట్టినా ఒక్కటే విధముగా నవ్వుతూ వుంటారు.
చిన్న పిల్లల మనస్త్వత్వంతో ఆడుతూ పాడుతూ వుంటారు.....
కరుణ కలిగితే అపారమైన సహాయం చేస్తారు, తమ పుణ్యం కూడా ఆఖరాకి తమ ప్రాణాలు సహితం ధారపోస్తారు.....అయితే ఎట్టి పరిస్థితులలోనూ ఎదుటి వారి ప్రాణాలు తీయరు. కారణం అమ్మ ప్రాణ స్వరూపిణి, మాతృ స్వరూపిణి ....ప్రాణాలు ఇవ్వడమే వీరి లక్ష్యం.....పూర్ణ దీక్షాపరులైన శ్రీవిద్యోపాసకులు మనతోనే తిరుగుతూ గుంభనంగా సాధన చేస్తూ వుంటారు....ఇటువంటి వారికి ఓక్కపూట భోజనం పెట్టినా లేక ఒక్క అనరాని మాట అన్నా అది వెయ్యింతల ఫలితాన్ని ఇస్తుంది....
శ్రీచక్రోపాసన అంటే సమస్త సృష్టిని, సమస్త లోకాలను,  ముక్కోటి దేవతలను త్రిశక్తి సహిత త్రిమూర్తులను, ఆ కామకామేశ్వరులను ఏకకాలంలో అర్చించినట్లు లెక్క.....
సాక్షాత్తు శ్రీదేవీ స్వరూపమైన శ్రీవిద్యోపాసకులు ఓక్క వారి గురువలకు తప్పించి లోకంలో మరెవ్వరి పాదములకూ నమస్కరించరు.....ప్రతి ప్రాణిలోనూ మాతృ భావన చేసి, మాతృ మూర్తిగా దర్శిస్తూవుంటారు.....వీరి శరీరభాగములలో శ్రీదేవి నాట్యమాడుతూ వుంటుంది...అదే శ్రీవిద్యోపాసన. భానా.
చాలా చాలా కష్టమైన విద్య.......నిలుపుకోవడం చాలా కష్టం..

వీరు ఏవ్వరి దగ్గర నుంచీ ఏమీ ఆశించరు....వీరికి కావలసిన వన్నీ అమ్మ సమకూర్చి పెడుతూ వుంటుంది...నోటిలోమాట నోటిలో వుండగానే సకలాభీష్ఠదాయిని తధాస్తు ..అని అంటుంది. భానా.
వీరు కదులుతూ వుంటే అమ్మ వారు కదులుతూ వుంటుంది....ఆర్తి వీరి కళ్ళల్లో,  మాటలలో కనిపిస్తూ వుంటుంది. అమ్మతనం వీరి చేతలలో కనిపిస్తూ వుంటుంది.

పాదుకాంత పూర్ణదీక్షాపరులుగా వున్న వారిని మనం వ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును....పూర్వ జన్మ సుకృతం, పుణ్యఫలం, గురువుల అనుగ్రహం లేకపోతే పూర్ణదీక్ష రాదు....వచ్చినా నిలబడదు...
ఇది యోగ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, మోక్ష విద్య....
అటువంటి మహా యజ్ఞమును చేస్తున్న మహా పురుషులకు నమస్కరిస్తూ....
.....ఆచార్య భాస్కరానంద నాథ

Sunday 24 July 2016

ఆత్మ

శరీరం వదలి ఆత్మ బయటకు వస్తే, చనిపోయిన వాళ్లు అందరూ మోక్షగాములేనా? ఆ ఆత్మకు శరీర స్పృహ లేదుగా, మరి చనిపోయిన వాళ్లు అందరూ జ్ఞానులై మోక్షానికి వెళ్లాలి గదా? అలా జరగడం లేదే?

శోధించి, శోధించి....మనసుతో ఆత్మను పొందాలి....బొందిలో వుండగానే ఆత్మ జ్ఞానం పొందాలి....మనసుతో, బుద్ధితో విచారించి, శరీరాన్ని వేరు చేసి, ఆత్మానుభూతి పొందాలి....మనసు body నుంచి detach కావాలి....అది శరీరం వున్నప్పుడే తెలుస్తుంది....శరీరం లేక పోతే జ్ఞానం లేదు, మోక్షం లేదు.....మనసు ఇంద్రియాలను వదలి, బుద్ధి సహాయముతో ఆత్మను పట్టుకోవాలి.....అప్పుడు నీ లోని నీవు, ఇతరులలోని జీవుడు కనిపిస్తాడు....ప్రాణం చూడవచ్చును.....నీలోని ప్రాణ జ్యోతిని దర్శించవచ్చును.....

ఓ 75 ఏళ్ల ముసలి వాడు చనిపోతే, మనసు ఏ బుద్ధితో వుంటే ఆ బుద్దితోనే ఆత్మ వెళుతుంది...కారణ శరీరంతో బాటు ఆత్మ వెళుతుంది కనుక, మనసు యొక్క చేష్టలను, వాసనలను పట్టుకొని వెళుతుంది.....కాబట్టి ముసలి వాడు చనిపోతే ముసలి ఆత్మ వెళుతుంది....కుర్రవాడు చనిపోతే కుర్ర ఆత్మ వెళుతుంది....ఆత్మకు వయసు నిమిత్తం లేకపోయినా, ఆత్మను ఆవరించిన మనసులో వయసు వున్నది....అందుకే కోరికలు తీరని ఆత్మలు ఇక్కడే తిరుగుతూ వుంటాయి....చనిపోయే ముందు ఏ శరీర ఆకృతిలో వున్నామో, సూక్ష్మ శరీరము అదే ఆకృతిని తీసుకోని గాలిలో లేస్తుంది.....ఆత్మ వేరు కానంతవరకూ, సూక్ష్మ శరీరం తన యొక్క పాత భౌతిక (స్థూల) రూపంలోనే వుంటుంది....ఈ సూక్ష్మ శరీరాన్ని అందరూ చూడలేరు....యోగులు, ఉపాసకులు, జ్ఞానులు మాత్రమే చూడగలరు.....శరీరంతో పూర్తి అనుబంధం తొలిగేంతవరకూ శరీరం చుట్టూ ఆత్మ తన సూక్ష్మ రూపంలో తిరుగుతూ వుంటుంది.....

మీరు వుండే ఇంటిలో మరకలు, బూజు ఎక్కడ వున్నాయో మీరు గమనించరు....అదే వేరే వాళ్ల ఇంట్లో మరకలు ఎక్కడున్నాయో ఇలాగే పట్టేస్తారు.....అలాగే మీ ఇంట్లో బూజు ఎక్కడ వున్నదో మూల మూలల శ్రద్ధగా వెతకండి....కనిపిస్తుంది....పరిశీలనా దృష్టిని అలవర్చుకోండి....ప్రతిదీ అంతర్గతంగా ఆలోచించండి ....మౌనంగా పరిశీలించండి ....మనసును ఏకాగ్రతను చేయండి....ఆత్మలు కనిపిస్తాయి....చూసే శక్తి వస్తుంది మీకు.....మంచి చెడు తెలుస్తుంది.....స్వార్ధం తొలగిపోతుంది .....తప్పు ఓప్పులు కనిపించని స్థితికి చేరిపోతారు.....దానికి సాధన అవసరం....మౌనం, మంత్రం అవసరం......మంత్రం మౌనంలో ఆగిపోవాలి....సూక్ష్మ నాడులలో విలీనమైపోవాలి....

ఆత్మ హృదయంలో వున్నా, సాధన చేత యోగులకు, జ్ఞానులకు ఆత్మ యొక్క శక్తి,  చైతన్యం నవ రంధ్రముల ద్వారా బయటకు వెద జల్లు బడుతుంది దాని కాంతి పుంజములు.....ముఖ్యముగా సాధకులు తమ చైతన్యాన్ని ఆజ్ఞా చక్రంలో కేంద్రీకరించి ధ్యానం చేస్తూ వుంటారు గనుక తమ సహస్రారం చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుంది.....వెంట్రుకల చివరి నుంచి కాంతి వెదజల్లబడుతూ వుంటుంది ఉపాసకులకు.....

బ్రతికి వున్న శరీరంలో ఆత్మ చైతన్యం హదయంలో వున్నందున వలన అది శరీరం వరకే వ్యాపించి జీవ కళతో వుంటాడు.....అదే చనిపోయే ముందు, ఓక్కో ప్రాణం బయటకు వచ్చేస్తూ వుంటుంది గనుక, శరీరం ప్రేత కళను పొంది, శరీరం పై భాగంలో కాంతి వలయం ఏర్పడుతూ వస్తుంది....చనిపోయే వాళ్లను పరిశీలించి చెబుతున్న మాటలు ఇవి...పూర్తి ప్రాణములు బహిర్గతం అయిన తరువాత శరీరం నల్లబడుతూ, చైతన్య కళ విహీనమై ప్రేత కళను పొందుతుంది.....శరీరం పైన జీవాత్మ యొక్క సూక్ష్మ శరీరంను చూడవచ్చును.....ధూళి లాగ....పొగ మాదిరి....
రెండు రోజుల క్రిందట మా దగ్గరి బంధువుల మరణంలో నేను చూసిన దృశ్యములు...అనుభూతులు.
..............ఆచార్య భాస్కరానంద నాథ/24-07-2016

Tuesday 26 April 2016

పవిత్రత - సాధన

నాకు రేపు ఎం జరగబోతున్నదో తెలిసిపోతున్నది ....నేను మొహం చూసి వాడి జాతకం చెప్పేస్తాను....నేను నా నోటి వెంబడి ఏది అంటే అది జరిగిపోతున్నది....నాకు అదృశ్య శక్తులు వున్నాయి....నాకు చాలా గొప్ప కలలు వస్తున్నాయి....నేను విభూది ఇస్తే జ్వరం తగ్గిపోతున్నది.......

ఇలా చాలా మంది నాతో అంటూ వుంటారు......ఏమిటి ఇది అంతా.....90% ఇలాంటి వాళ్లందరినీ అడిగాను....మీ గురువు ఎవరు అని....మాకు గురువులు ఎవ్వరూ లేరండీ....మాకు కలలో కనిపించి ఎవరో బాబా చెప్పారండీ మంత్రం....అది చేస్తున్నాను నాకు ఇలా శక్తి వచ్చేసింది.....
ఓకావిడ అడిగింది నన్ను....ఏమండీ నాకు అమ్మవారు కనిపించి చండీ సప్తశతి చదవమన్నది ...ఎలా చేయాలండీ అని....
అమ్మా ఆమెనే అడుగు ఎలా చేయాలో....నేను చెప్పలేను...అని తప్పించుకొన్నా...
కొందరు మాకు ఆ గుడికి వెళితే ఓ సన్యాసి మాకు శ్రీచక్రం ఇచ్చారండీ....ఎలా పూజ చేయాలి?
నాకు తెలియదమ్మా వారినే అడుగు....అని చెప్పా....

అసలు ఇదంతా ఏమిటి నిజమా? భ్రమా? చిత్త చాంచల్యమా?

అదుపు తప్పిన సాధన ఇది.....సాధనలో తాత్కాలిక అతీంద్రియ శక్తులు రావడం సహజం.., నిజం....వాటిల్ని తట్టుకొనే శక్తి అందరికీ వుండదు....సరైన గురువు లేకపోతే ఎలా నియత్రించాలో తెలియక శక్తులు దుర్వినియోగం అవుతాయి. Mental imbalance అవుతుంది....తమకు ఏదో శక్తి వున్నదని పిచ్చిలో పడి భ్రష్టులు అయిపోతారు. నీలో ఏ శక్తి లేదు, అదంతా ఒట్టి భ్రమ అని చెప్పినా వారు నమ్మరు...అదే భ్రమలో తిరుగుతూ వుంటారు, నిజం తెలుసుకోలేరు ఎప్పటికీ....ఇదో పిచ్చి....ఏదో మానవాతీత శక్తులు తనకు వున్నాయి అని గాఢంగా నమ్ముతూ వుంటారు, నమ్మబలికిస్తూ వుంటారు....సాధనలో జరిగే అతి సాధారణ స్థితి ఇది....దీనిని దాటాలి....ఇక్కడే చాలా మంది ఆగి పిచ్చిలో పడిపోతూ వుంటారు....తనకు ఏ గొప్ప స్థితి రాలేదని, అది మాయ అని ముందుకు జరగాలి, సాధన జరగాలి.....తనకు తాత్కాలికంగా వచ్చిన శక్తులను గురించి పట్టించుకోకూడదు ...భ్రమలో, మాయలో పడకూడదు. దీనివలన ఎంతో మానసికమైన ఓత్తిడికి గురి అవుతున్నారు ఎందరో.

గురువు...గురి లేకుండా తమకు తాము ఏదో గొప్ప దైవాంశ సంభూతులని అతి నమ్మకం....పిచ్చి.....అదే నిన్ను ఈ పరిస్థితులలోకి చేరుస్తున్నది ....ఎక్కువగా ఆడవాళ్లు ఇలా తయారౌతున్నారు....పిచ్చి భ్రమలలోకి వెళ్లి చేతులారా బంగారం లాంటి సంసారాన్ని నాశనం చేసుకొంటున్నారు....అదే trans లో ఊహలలో వుండిపోతున్నారు.....మరి వారు చెప్పే మాటలు అబద్దమా కాదు.....నిజం.
ఇంట్లో మొగుడికి అన్నం వండి పెట్టలేవు, పిల్లవాడికి కావలసినవి చూడవు....ఎక్కడో ఎవరో బాబా....ఆ ప్యాలస్ లో ఒళ్లు మరచి భజనలు....మొగుడ్ని ప్రేమించలేవు....ఎవడో ముక్కు మొహం తెలియని వాణ్ణి నమ్మి నీ జీతం రాళ్లు అప్పనంగా ఇచ్చేస్తావు.

పద్మవ్యూహం లోకి వెళ్లడం ఎంత ముఖ్యమో రావడం అంత ముఖ్యం .

మన మనస్సు లోతులకు వెళ్లి శోధిస్తే కొన్ని కోరికలు బీజ రూపంలో బలంగా నక్కి వుంటాయి....అవి తీర్చుకోవడానికి మనిషి అవకాశం కోసం ఎదురు చూస్తూ వుంటాడు...

సరిగ్గా ఇదే సమయంలో ఎవరన్నా చెప్పే మాటలు చాలా బలంగా తాకుతాయి గుండెలను...నీవు కారణ జన్మురాలివమ్మా....నీ వలనే నీ భర్త బ్రతికి వున్నాడు....నీవు మహా శక్తిమంతురాలివి....నీ చేతిలో ఈ రేఖ వున్నది....నీ మొహం వెలిగిపోతున్నది....నీవు మహా యోగినివి.....అని అంటూ ఓ మంత్రమో లేక యంత్రమో ఇస్తాడు....ఇది జపించు రోజూ అంటాడు.....అతని అమాయకత్వాన్ని చూసి మనం వుత్త చేతులతో పోనీయకుండా ఏదో తృణమో, ఫణమో ఇచ్చి పంపుతాము ....

ఎవడో వాడు తెలియదు....రుద్రాక్ష అంటాడు, కోయవాళ్ల దగ్గర వుండే ఓ డూప్లికేట్ రుద్రాక్ష ఐదు పైసలు కూడా చేయనిది నీకు అంట గట్టుతాడు....బజారులో 50 రూపాయలకు కొనుక్కొని వచ్చిన రాగి యంత్రం శ్రీచక్రం అని నీకు ఇస్తాడు.....పాపం ఆడవాళ్లు అతి సులభంగా నమ్మేస్తారు....ఇది చేస్తే నీకు డబ్బు వస్తుంది లేదా మీ ఆయన కొంగు పట్టుకొని తిరుగుతాడు అని చెబుతాడు....

పాపం ఆడదానికి ఎంత సేపూ తన సంసారం, పిల్లలు బాగుండాలని తపన...అందరినీ నమ్మేస్తుంది ....సాధన మొదలు పెడుతుంది....

కొన్నాళ్లకు నిజంగానే ఆ శక్తి వస్తుంది.....ఇక తట్టుకోలేదు....ఆడది మహా కాళి అయి చిందులు త్రోక్కితే మగ వాడు మహా కాలుడు కావాలి, కాని ఈయనకు సాధన లేదు,  అందువలన కాలేడు....ఆమెను పట్టుకోలేడు....మరి ఎం చేయాలి?

సూర్యుణ్ణి ఆరాధించిన కుంతికి ఏమైనది....నాకు తెలియదు, నన్ను ఆరాధించినావు,  నేను వచ్చాను, నీకు వరం ఇచ్చినగాని నేను వెనుకకు మరలను....అన్నాడు ఇచ్చేసాడు....జీవితాంతం బాధపడినది.....మరి గురువులు ఇవ్వలేదా? గురువులే ఇచ్చారు, అవసరం అయినప్పుడు వాడుకోమన్నారు....వినకుండా....ఎలా వుంటుందో అని మంత్రం చదివింది సూర్యున్ని చూసి చదివినది.....దేవతలు ఇచ్చేశారు శక్తిని....ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు....ఎవరినీ అడిగి చేయలేదు....ఫలితం అనుభవించినది.

ఆడవాళ్లు గాని, మగ వాళ్లు గాని ఏదైనా సాధన చేసేటప్పుడు గురువుల పర్యవేక్షణ లో సాధన చేయవలయును.....లేనిచో వారి సాధన కొన్నాళ్లకు నిజంగా ఫలించును, ఆ మంత్ర శక్తి కూడా నీకు వస్తుంది.....ఇక్కడ నీవు పొరబాటు చేస్తావు....ఆ శక్తికి తట్టుకోలేవు, మతి చలిస్తుంది, నీకై నీవు కంట్రోలు చేసుకోలేకపోతే వచ్చే విపరీత అనర్ధాలు....అణిమాది అష్ట
సిద్దులు కూడా నీకు సాధనలో వస్తాయి తప్పకుండా కానీ ప్రయోజనం ఏమిటి? ఎలా ఉపయోగించాలో తెలియక, ఆ మత్తులో పడి పిచ్చి వాగుడు వాగుతూ వుంటావు...

ఓ త్రాగుబోతు నిండా త్రాగి చిందులు త్రొక్కుతూ, బూతులు తిడుతూ భార్యను కొడుతూ వుంటాడు.....ఇంకోడు పూర్తిగా త్రాగి, మత్తును అనుభవిస్తూ గమమ్ముగా ఇంటికి వచ్చి నిదురపోతాడు....ఏం వాడికి తిట్టాలని వుండదా? వుంటుంది....కానీ వాడు ఎరుకలో వుంటాడు, సంస్కారం పదే పదే గుర్తు వస్తూ వుంటుంది.....

శారీరికంగా, మానసికంగా పవిత్రతను పెంచుకొంటూ, యమ, నియమములను సాధన చేస్తూ గురువు గారి పర్యవేక్షణలో మంత్ర సాధన చేస్తే ....సరైయిన మార్గములో తిన్నగా ఓడుదుడుకులు లేకుండా పురోగతి సాధించగలవు.....లేదా mis fire అవుతుంది నీ సాధన...దానిని నీవు నియంత్రించ లేవు...

మనలోని మాలిన్యాలు ధ్యాన  సమయాలలో, సాధనలో పైకి తప్పక వస్తాయి...మనల్ని దారి తప్పిస్తాయి...
మనం అలవాటు పడిన రుచులు మనల్ని అంత తేలికగా వదలిపెట్టవు ...ఎంతో నియంత్రణ కావాలి...ఇంద్రియాల మీద వున్న ఆకర్షణలు అంతో ఇంతో బీజ రూపంలో అణగారి వుంటాయి.
ఆత్మ సాక్షాత్కారం కానిదే అవి పూర్తిిగా దహింపబడవు....

పవిత్రమైన మనస్సుతో, గురువుల పరివేక్షణలో ఈ సాధనలు పరమ శాంతితో కొనసాగించాలి.
ప్రలోభాలకు లొంగకుండా, అత్యున్నతమైన సాక్షాత్కారం కలుగనంత వరకూ అతి జాగ్రత్తగా వుండవలయును...సంపూర్ణమైన జాగరూకతో వుండాలి....జాగరూకతతో వున్నవాడు ఎప్పటికప్పుడు తనను తాను పరిశీలించుకొంటూ సరి చేసుకొంటాడు.....లేదంటే పిచ్చి బ్రమలలో పడిపోతాడు....సాధన పవిత్రంగా, ఓ నిర్ధిష్ట పద్ధతిలో కొనసాగించాలి...
పాతిక వేలకు మోక్షం అంటే పరిగెత్తి వెళ్ళకండి మోసపోతారు, పిచ్చివాళ్ళు అయిపోతారు, మీ వెనుక మీ కుటుంబం వున్నది, మీ భర్త, పిల్లలు బిక్కమొహం వేసుకొని మీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేమతో.......
దేవుడు ఎక్కడో లేడు మీ ఇంట్లోనే, మీలోనే కలడు, ఆయన్ను వెలికి తీయండి......

..........ఆచార్య భాస్కరానంద నాథ/25-04-2016..

Saturday 16 April 2016

వనదుర్గా

వనదుర్గ - మహావిద్య...

పంచ శత సంఖ్యాక (500) వివిధ మహా మంత్రములు గల వనదుర్గా మహా విద్యా మంత్రము, విదులయందొక విశిష్ట స్థానము ఆక్రమించి యున్నది. దీనినే మహావిద్య అని అందురు...దీనియందు వనదుర్గా మహా విద్య మంత్రము, హృదయము, వారాహీ, వటుక, సర్వ మంగళ, చండీ, కార్తవీర్యార్జున, బ్రహ్మాస్త్ర రుద్ర, దేవతా, రాక్షస, శక్తి నామక దశ విధ దశ దిగ్భందనములు, శ్రీ వనదుర్గా మంత్ర రాజ మాలా మంత్ర పారాయణమునూ గలిగి తుదిన వనదుర్గా మంత్రవర్ణావళీ స్తోత్రము, కవచమును గలవు. ఈ పారాయణ మొనర్చు వారికి నిగ్రహానుగ్రహ దక్షత సిద్ధింపగలదు. పరమంత్ర యంత్ర తంత్రాభిచారములు ఈ పారాయణ మొనర్చు వారిని ఏమియూ చేయజాలవని పెద్దల అభిప్రాయము.
ఈ పారాయణకు శ్రీవిద్యలో పూర్ణదీక్షాధికారము గలవారు మాత్రమే అర్హులు....

అర్జునుడు పాశుపతాస్త్ర సంపాదనకై ఉగ్ర తపము ఆచరించు సమయమున పరీక్షార్థమై పరమశివుడు కిరాతరూపమునను, అమ్మ పార్వతీదేవి శబరి రూపమునను తపోవనమున ప్రవేశించిరి. శబరి రూపము దాల్చిన పార్వతియే వనదుర్గగా ప్రాదుర్భావమయినది.

అట్టి వనదుర్గకు పాదాభివందనం చేస్తూ....ఆచార్య భాస్కరానంద నాథ./16-04-2016

Sunday 10 April 2016

ఆచార్య దీక్ష....

ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్యః

వందే గురుపద ద్వంద్వం ఆవాఙ్మానస గోచరం,
రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్క్యం త్రైపురం మహః....( గురుగీత)

భారతీయ సాంప్రదాయ సార్వభౌములు, అద్వైత సంప్రదాయ ప్రవర్తకులు, ఆచార్యులు శ్రీ విద్యాశంకర భగత్పూజ్యపాదులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులు,  శంకర భగవత్పాదులు చతురామ్నాయ పీఠములను స్థాపించిరి....అందు దక్షిణామ్నాయ పీఠమైన శృంగేరి పీఠమును సురేశ్వరాచార్యుని అధిపతిగా నియమించిరి ...

ఈ పీఠ పరంపరలోని వారే శ్రీ విద్యారణ్యులు. వీరు విజయనగర సామ్రాజ్య స్థాపనతో బాటు శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠమును ప్రవర్తిల్ల చేసియున్నారు. అట్టి విరూపాక్ష పీఠ పరంపరలో 42 వ పీఠాధిపతులు, భాస్కరానంద నాథునికి పరమేష్ఠి గురువులయిన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ కల్యాణానంద భారతీ మహా స్వామి వారు...స్వామి వారు బ్రహ్మ విద్య యందును, మంత్ర శాస్త్రమందేగాక  జ్యోతిర్విద్యాది బహు శాస్త్ర పారంగతులు, సర్వ శ్రౌత, స్మార్త, కర్మాంగ విషయ నిష్ణాతులు ....దేశంలో తమ కాలమందు బహుళ ప్రచారంలో వున్న వామాచార పద్ధతిని పతన హేతువని, దూష్యమని, అగ్రాహ్యమని, సహేతుకంగా ఖండించి, దక్షిణాచారమే ఉత్తమ మార్గమని విమర్శనా సహితంగా ఉపదేశించి యున్నారు. అంతవరకూ తాంత్రిక మార్గాచరణలో వున్న శ్రీచక్రోపాసనను సంస్కరించి వైదికమైన దక్షిణాచార రీతిగా శ్రీయాగ సూత్రమను చక్రార్చనా పద్ధతిని, లలితా రహస్యనామ వ్యాఖ్యను ప్రచురించి యున్నారు ....

అనేక మంది శిష్యులకు తదుపాసనా విశిష్టమైన బ్రహ్మ విద్యను అనుగ్రహించి, బ్రహ్మ విద్యా జిజ్ఞాసువులకు ఉపాసన యందు కలుగు పెక్కు సందేహములను పరిహరింప తలచి బ్రహ్మకళ యను తమ నిర్ణయ గ్రంధమును అనుగ్రహించినారు...తద్వారా సర్వోపనిషద్వాక్య సమన్వయంతో, అద్వైత సిద్ధాంతాన్ని రూఢి పరచి, ఉపనిషత్తులు బోధించిన ఉపాస్య బ్రహ్మ విద్యకు ప్రతీకయైన శ్రీచక్ర - శ్రీవిద్యా రహస్యములను సూత్రీకరించి, సంప్రదాయ బద్ధమైన శ్రీచక్రోపాసనా క్రమాన్ని " బ్రహ్మకళ" అను గ్రంధమును అనుగ్రహించినారు శ్రీగురువులు ..

శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు జగద్గురువులు శ్రీకల్యాణానంద భారతీ పూజ్యపాదులు ఈ భాస్కరానంద నాథులకు పరమేష్ఠి గురువులు....వారి యొక్క తపఃశక్తి సమ్మేళిత మేధాశక్తి తో బహుగ్రంధ పరిశోధన జరిపి శ్రీచక్ర విధి విధానంలోను, శ్రీవిద్యోపాసనలోను ఒక విశిష్ట మైన సాంప్రదాయము ను ఏర్పాటు చేసి యున్నారు..వారికి గల శిష్యగణంలో లబ్ధ ప్రతిష్ఠులైన వేదాంతులు, నైష్ఠికులు, లౌకికులు, న్యాయవాదులు మొదలైన వారెందరో కలరు. వారి శిష్య, ప్రశిష్యులలో ప్రముఖులు శ్రీ వడ్లమూడి వేంకటేశ్వర రావు గారి పితృపాదులు శ్రీ లక్ష్మీనారాయణ గారు, మా గురువుగారి తండ్రిగారు శ్రీ ప్రత్యగానంద భారతీ మహా స్వామి గారు, మరియు కుర్తాళం పీఠాధిపతులు అయిన శ్రీ శివచిదానంద భారతీ స్వామి వారు, ప్రసాదరాయ కులపతి గారు, శ్రీ యాబలూరి లోకనాథ శర్మ గారు, వారి తండ్రి గారైన బ్రహ్మశ్రీ యాబలూరి ఆదినారాయణ శర్మగారు, యద్ధనపూడి అయ్యన్న పంతులు గారు, శ్రీ వడ్లమూడి వేంకటేశ్వర రావు గారు ....ఇంకా ఎందరో ప్రముఖ శిష్యులు గలరు....వారిలో నేను మూడవ తరమునకు చెందిన వాడ్ని...

శ్రీ వడ్లమూడి వేంకటేశ్వర రావు గారు, జగద్గురువులు శ్రీ కల్యాణానంద భారతీ మహా స్వామి విరచించిన బ్రహ్మకళ కు సవిస్తరంగా వ్యాఖ్య " శ్రీచక్ర దర్శనము" అను గ్రంథమును రచించిరి....అందు తమ పరాపర గురువులు అనుగ్రహించిన ఉపాసనా రహస్యములను, పద్ధతులను ఎన్నంటినో వారు గ్రంధస్థం చేసి, మనకు కృపతో అనుగ్రహించిరి....

జగద్గురువులు శ్రీ కల్యాణానంద భారతీ మహా స్వామి వారు అనుగ్రహించిన ఉపాసనా క్రమమంలో, శ్రీవిద్యోపాసనా దీక్షలో చిట్టచివరిదైన విద్య " ఆచార్య దీక్ష"....

ఈ దీక్షను అస్మద్గురువరేణ్యులు బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ గారు, తమ శిష్యులలో జ్యేష్ఠ శిష్యులైన నాకు ( భాస్కరానంద నాథ) శ్రీ దుర్మిఖి నామ సంవత్సర ఉగాది నాడు అనగా 08-04-2016 దినమున బెంగుళూరు లో " ఆచార్య దీక్ష" ను అనుగ్రహించడమైనది...

శ్రీచక్ర దర్శనము అను ఈ ఉపాసనా గ్రంథమును నాకు బ్రహ్మశ్రీ లోకనాథ శర్మ గారు, బ్రహ్మశ్రీ వడ్లమూడి వేంకటేెశ్వర రావు గారు 18-02-1999 లో విజయవాడలో వారి ఇంట్లో బహుకరించినారు.....అందలి విషయములను, రహస్యములను పెద్దల నుంచి తెలుసుకొన్ననూ, మా గురువులు ఉపదేశించే వరకు అంటే నేటి వరకూ వేచి వున్నాను.....

సూచన:- పుస్తకములను చూసి మంత్రములను ఉపాసన చేయకూడదు, గురువుల అనుగ్రహం కలిగేంతవరకూ వారిని ఏ మంత్రములనూ అడగకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు ....

ఆచార్య దీక్ష:-

దీనినే పురుషోత్తమ విద్య అని, భువనేశ్వరి విద్య యని, ఆచార్య దీక్ష అని అందురు.
ప్రణవమునకు మహామాయ బీజమును, కమలా బీజమును కలిపిన ఈ త్ర్యక్షరీ మంత్రము ఉత్పత్తి అగును.......హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ ....అను పురుష సూక్త వాక్యము ప్రకారము ప్రణవమునకు మాయా బీజము మరియు కమలా బీజమును కలిపిన మంత్రోద్ధారణ కలుగును....ఈ రెండు బీజములు ప్రణవమునకు పత్నీ స్థానములు అని పెద్దలు చెప్పుదురు....
ఈ స్థితి వలననే పంచదశి కన్నా షోడశి మంత్రము విశిష్టమని, అట్టి షోడశీ మంత్రమే బ్రహ్మ విద్య యని, గృహస్థులకు ఉపాసనా వరిష్ఠమని మహా గురువులు నిర్ధారించియున్నారు......దీని విశిష్టత ను దర్షించిన శ్రీపాదులు, సర్వసంగ పరిత్యాగులకు, యతీశ్వరులకు ప్రణవోపాసన అని, వానప్రస్థులకు ఈ త్ర్యక్షరీ విద్య బ్రహ్మ జ్ఞాన కారకమని ఉపదేశించియున్నారు......
ఈ మహా మంత్రమునకు ఋషి సదాశివుడు, కామేశ్వరి దేవత...ధ్యాన శ్లోకం పురుష సూక్తం, శ్రీ సూక్తం...

శ్రీ విద్య దీక్షా పరంపరలో బాల, నవాక్షరి, పంచదశి, షోడశి, మహా షోడశి, మహా పాదుకలు, పూర్ణ దీక్ష, మహా విద్య.....దాని తదుపరి ఆచార్య దీక్ష.....

కావున శ్రీ గురువులు శ్రీ విద్యా షోడశి యందు పూర్ణ దీక్షితులయి, తదనుష్ఠాన వృద్ధులయిన తమ ముఖ్య శిష్యులకు ఈ త్ర్యక్షరీ విద్యా దీక్షను అనుగ్రహించినారు...దీనిని ఆచార్య దీక్షగా శ్రీపాదులాదేశించితిరి.......తద్వారా ఆచార్య దీక్షా సంప్రదాయమును ప్రవర్తింపజేసిరి.......ఈ విద్యను శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరులు, ఆచార్య దీక్షాధికార యోగ్యులయిన తమ తమ గురువుల నుండి దీక్షనభ్యసించి తరింతురు గాక.
మోహమునకు గురియై పుస్తకములను చూసి మంత్రములను ఉపాసించ కూడదు....మీ గురువులు చెప్పేంతవరకు వేచి యుండి అనుష్టించవలయును.....

ఇట్టి ఆచార్య దీక్షను నాకు అనుగ్రహించిన అస్మద్గురువులకు పాదాభివందనం చేస్తూ....

......ఆచార్య భాస్కరానంద నాథ/ 10-04-2016, శ్రీకాళహస్తి ....